చిన్ననాటి ప్రేమ చిగురించి.. భర్తను మట్టు బెట్టించి

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడి చేత చంపించింది ఓ మహిళ. ఆధారాలేవీ లేకుండా తెలివిగా హత్య చేశామని అనుకున్నా.. ..

Published : 19 Jul 2021 01:08 IST

విశాఖపట్నం: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడి చేత చంపించింది ఓ మహిళ. ఆధారాలేవీ లేకుండా తెలివిగా హత్య చేశామని అనుకున్నా.. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో వీరి బండారం బయటపడింది. రెండ్రోజుల క్రితం విశాఖ మధురవాడలోని దుర్గానగర్‌లో రాత్రి నడకకు వెళ్లి వస్తున్న సతీష్‌ను ఓ వ్యక్తి రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. అదే సమయంలో చనిపోయిన వ్యక్తితో పాటు అతని భార్య రమ్య, పిల్లలు కూడా ఆరు అడుగుల దూరంలో ముందు నడుస్తున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే సతీష్‌ మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో భార్య పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. సతీష్‌ భార్య రమ్య ఫిర్యాదులో తన భర్తపై దాడికి పాల్పడుతున్న సమయంలో తాను ఆరు అడుగుల దూరంలో ఉన్నానని చెప్పడం, ఆ సమయంలో ఆమె ప్రతిఘటించకపోవడం పట్ల అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం బయటపెట్టింది. మొదట తన భర్తకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వేరే వ్యక్తితో గొడవలు ఉన్నాయని పోలీసులను పక్కదారి పట్టించింది. హత్యకు రెండ్రోజుల ముందే ప్రియుడు షేక్‌ బాషాతో కలిసి రమ్య రెక్కీ నిర్వహించింది. సీసీ కెమెరాలు లేని, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని నిందితులు హత్యకు పాల్పడినట్టు డీసీపీ గౌతమిశాలి మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులిద్దరూ స్కూల్‌ నాటి నుంచి స్నేహితులుగా ఉంటూ ప్రేమ వ్యవహారం నడిపించారని తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత పదో తరగతి స్నేహితుల వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా తిరిగి వీరు ఒక్కటయ్యారని డీసీపీ తెలిపారు. తమ బంధానికి అడ్డుగా ఉన్న సతీష్‌ను అడ్డు తొలగించుకుని తాము ఒక్కటవ్వాలని రమ్య, బాషా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్టు డీసీపీ వివరించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని