Nirmal: ఖానాపూర్‌లో దారుణం.. నడిరోడ్డుపై యువతి హత్య

నిర్మల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.

Updated : 08 Feb 2024 19:01 IST

ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. జిల్లాలోని ఖానాపూర్‌ పరిధి శివాజీనగర్‌లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. యువతి అలేఖ్య (22), యువకుడు శ్రీకాంత్‌ గతంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇంట్లో విషయం తెలియడంతో యువతి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు. నాలుగు నెలల క్రితం వేరే వ్యక్తితో ఆమెకు వివాహం నిశ్చయించారు. పెళ్లి నిశ్చయించుకున్న వారికి ఫోన్‌ చేసి అమ్మాయి, తాను ప్రేమించుకుంటున్నామని చెప్పి వివాహం జరగకుండా చేశాడు. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలను పీఎస్‌కు పిలిపించిన పోలీసులు.. యువతిని ఇబ్బంది పెట్టొద్దని యువకుడిని హెచ్చరించారు. దీంతో కసి పెంచుకున్న శ్రీకాంత్‌.. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం టైలరింగ్‌ శిక్షణ తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో వెనకనుంచి కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన ఆమె వదిన, రెండేళ్ల చిన్నారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి రియాన్ష్‌ తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో నిర్మల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ మోహన్‌, ఎస్‌ఐ లింబాద్రి పరిశీలించారు. హత్య చేసిన తర్వాత పరారైన నిందితుడి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని