logo

సరిహద్దుపై ఉత్కంఠ

రానున్న ఏడాది ప్రథమాంకంలో కర్ణాటకలో.. ఆపైమహారాష్ట్రలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది.

Published : 30 Nov 2022 00:38 IST

సుప్రీంలో నేడు మహా తీర్పు
న్యాయవాదులకు బొమ్మై సూచనలు

ఉద్రిక్తతల క్రమంలో మహారాష్ట్ర- సరిహద్దు ప్రాంతాల్లో వాహన తనిఖీల్లో పోలీసులు నిమగ్నం

ఈనాడు, బెంగళూరు : రానున్న ఏడాది ప్రథమాంకంలో కర్ణాటకలో.. ఆపైమహారాష్ట్రలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. ఎడతెగని సరిహద్దు వివాదంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ తుది ఘట్టానికి చేరుకోనుంది. ఈ వివాదంపై మధ్యంతర తీర్పు కూడా వెల్లడయ్యే అవకాశాలుండటంతో ఇరు రాష్ట్రాలూ వాదనలకు పదును పెట్టాయి. మహారాష్ట్ర సర్కారు 2017లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సవాలు చేసి ఆ తాలూకూ ఫలితం కోసం ఎదురు చూస్తూ- తాజాగా వెల్లడించే అభిప్రాయం తమకు అనుకూలంగా ఉండబోతోందని ఆశాభావంతో ఉంది.

బొమ్మై ముందడుగు

సుప్రీంకోర్టులో తీర్పు రానున్న సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సోమవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. రాజకీయ అంశాలకు ఎంతటి ప్రాధాన్యమున్నా అంతకు మించిన సరిహద్దు అంశంపై ఎట్టకేలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా దిల్లీలో రాష్ట్రం తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గితో సమావేశమైనట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. తాను ఈ అంశంపై న్యాయవాదులతో సూచనప్రాయంగా నేపథ్యాన్ని వివరించినట్లు తెలిపారు. వారికి ఈ విషయంపై అవగాహన ఉండటంతో వాదనలకు సంబంధించిన ప్రస్తావనలపై పునఃసమీక్ష చేశామన్నారు. మహారాష్ట్రలో పార్టీలేవైనా సరిహద్దు వివాదాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకోవటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా ఇరు రాష్ట్రాలకు చెందిన భాషా ప్రభావిత గ్రామాల నిర్వహణలపై ప్రాథమిక సూచనలున్నాయి. వీటిని మహారాష్ట్ర సర్కారు ఎప్పటికప్పుడు సవాలు చేస్తూ వస్తోందని గుర్తు చేశారు.

సంపూర్ణ విశ్వాసం

కోర్టుల్లో తీర్పులు, మహరాష్ట్ర వాదనలు ఏమున్నా చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న కర్ణాటకకు న్యాయం చేకూరుందని ముఖ్యమంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కన్నడ ప్రభావిత గ్రామాలు కర్ణాటకలో చేరాలన్న తీర్మానం, ఈ గ్రామాల విలీన ప్రస్తావనపై తుది నిర్ణయం సుప్రీంకోర్టు ద్వారా వెల్లడి కావాలన్నారు. అంత వరకు సహనంతో ఉండాలని హితవు పలికారు. ఇదే సందర్భంగా సరిహద్దు వివాదంపై చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఆహ్వానించలేదన్న వాదనను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇరు రాష్ట్రాల జల వివాదంపై తీర్మానాలు చేసినా తమను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. భాజపా అందుకు భిన్నంగా అఖిలపక్ష సమావేశాన్ని ఆహ్వానించిందన్నారు. ఇందులో రాజకీయాల ప్రస్తావన లేదని స్పష్టపరిచారు.

పోలీసులకు సూచన

సుప్రీం కోర్టులో తీర్పు వెల్లడి కానున్న నేపథ్యంలో సరిహద్దుల్లో శాంతిభద్రతలు కాపాడాలని ముఖ్యమంత్రి హోంశాఖ కార్యదర్శి, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పాలనాధికారులకు సూచించారు. కోర్టులో తీర్పు ఎలా ఉన్నా ప్రజలు ఉద్రేకానికి లోను కాకుండా చూడాలన్నారు. ఈ మేరకు ఏడీజీపీ అలోక్‌కుమార్‌తో ఫోనులో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మహారాష్ట్ర మంత్రులు బెళగావిని సందర్శించినా, జత్‌ తాలూకా గ్రామ పంచాయతీ ప్రతినిధులు కర్ణాటక అధికారులతో చర్చించే ప్రయత్నం చేసినా అందుకు సహకరించాలని హోంమంత్రికి సూచించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రాజెక్టుకు పచ్చజెండా

జత్‌ తాలూకాలోని గ్రామాలకు తాగునీటి సమస్య కారణంగా కర్ణాటకలో విలీనం కావాలన్న తీర్మానం మహారాష్ట్ర సర్కారును ఇరుకునపడేసే అంశం. నేడు సుప్రీంకోర్టు విచారణలో ఈ ప్రస్తావన వస్తుందని మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. సాంగ్లి జిల్లాలోని 48 గ్రామాలకు తాగు, సాగు నీటి సమస్యలు తీర్చే మైసాల్‌ నీటిపారుదల ప్రాజెక్టుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే ఆమోదం తెలిపారు. రూ.2 వేల కోట్ల సవరింపు వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు 2023 జనవరి 1నుంచి టెండర్‌ ప్రక్రియ మొదలు కానుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఉన్నపళంగా ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చినట్లు బెళగావి భాజపా నేతలు ఆరోపించటం తాజా పరిణామం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని