logo

శరావతి పరిహారం మాటేంటి?

శరావతి ఆనకట్ట నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రజలకు ఇప్పటి వరకు పరిహారాన్ని ఇవ్వలేదని యడియూరప్ప పెదవి విరిచారు.

Updated : 03 Feb 2023 05:37 IST

సమావేశంలో జ్ఞానేంద్ర, యడియూరప్ప, బి.వై.రాఘవేంద్ర

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : శరావతి ఆనకట్ట నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రజలకు ఇప్పటి వరకు పరిహారాన్ని ఇవ్వలేదని యడియూరప్ప పెదవి విరిచారు. ప్రభుత్వం మంజూరు చేసిన భూమి తమదంటూ అటవీశాఖ కొత్త వాదనను తెరపైకి తీసుకు వచ్చింది. శరావతి వెనుక జలాల (బ్యాక్‌ వాటర్‌) కారణంగా భూములు ఖాళీ చేసిన 12 వేల కుటుంబాలకు పరిహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. యడియూరప్ప నేతృత్వంలో లోక్‌సభ సభ్యుడు బి.వై.రాఘవేంద్ర, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, ఎమ్మెల్యేలు హరతాళు హాలప్ప, అశోక్‌ నాయక తదితరులు సంబంధిత అధికారులతో గురువారం సమావేశమయ్యారు. శరావతి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గత ఆరు దశాబ్దాల నుంచి పోరాటం కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర అటవీశాఖ మంత్రిని ఇటీవలే సమావేశం కాగా.. వారికి భూములు, పరిహారాన్ని ఇచ్చేందుకు ప్రత్యామ్నాయాన్ని కోరామని తెలిపారు. నిర్వాసితులకు మొత్తం తొమ్మిది వేల ఎకరాల భూమిని మంజూరు చేయాలని కేంద్రానికి నివేదికను, సిఫార్సులను పంపిస్తున్నామని చెప్పారు. నిర్వాసితులకు కొత్తగా కేటాయించిన ప్రాంతంలో ఇళ్లు కట్టుకున్న చోటును గ్రామంగా పరిగణనలోకి తీసుకున్న తర్వాత అటవీ శాఖ కొత్తగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వాలు విడుదల చేసిన 27 ఆదేశాలలో నిర్వాసితులకు 9,119 ఎకరాలు ఉండగా, సమీక్ష అనంతరం 9,653 ఎకరాలుగా తేలిందన్నారు. వారికి శాశ్వతంగా భూమిని పంపిణీ చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. శరావతి నదిపై లింగనమక్కి వద్ద 1959లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. అప్పుడు భూములను ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. అప్పటి నుంచి బాధితులకు పరిహారం లభించలేదు. కొన్ని గ్రామాలకు విద్యుత్తు సదుపాయాన్ని కల్పించేందుకు హైకోర్టు ఇటీవలే ఆదేశాలూ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని