logo

అమిత్‌షాకు ఫిర్యాదు చేస్తా

కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్‌ స్కాండల్‌ సీడీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యేందుకు మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి సన్నాహాలు చేసుకుంటున్నారు.

Published : 03 Feb 2023 02:39 IST

రమేశ్‌ జార్ఖిహొళి

బెళగావి, న్యూస్‌టుడే : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్‌ స్కాండల్‌ సీడీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యేందుకు మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ కేసును ఇక్కడికే వదిలి పెట్టాలని ఆయన సోదరుడు బాలచంద్ర జార్ఖిహొళి అభిప్రాయపడటం గమనార్హం. రమేశ్‌కు వ్యతిరేకంగా న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. రాసలీలల సీడీ బయటకు రావడంతో విధి లేని పరిస్థితులలో జార్ఖిహొళి తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. దీని వెనుక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉన్నారనేది జార్ఖిహొళి ఆరోపణ. ఆ ఆరోపణలకు సంబంధించిన దాఖలాలను ముఖ్యమంత్రి బొమ్మై, హోం మంత్రి జ్ఞానేంద్రకు ఆయన అందజేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసేందుకు సమయాన్ని కోరిన జార్ఖిహొళి ఇప్పటికే హస్తినకు వెళ్లారు. డీకే శివకుమార్‌పై ఆధార రహిత ఆరోపణలు చేయడం మానుకోకపోతే పరువు నష్టం కేసు దాఖలు చేసి, న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సంకేత ఏణగి ట్వీట్ చేసి హెచ్చరించారు. ఈ కేసును ఇక్కడితో వదిలి పెట్టాలని బాలచంద్ర జార్ఖిహొళి తన సోదరుడిని కోరారు. ‘సీడీ విషయంలో మూడు కుటుంబాలకు చెడ్డపేరు వచ్చింది. ఈ విషయాన్ని పట్టుకుని ముందుకు వెళితే మరింత వివాదం ముదురుతుంది. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడికే వదిలి పెట్టాలి’ అని రమేశ్‌ను కోరతానని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రితో చర్చిస్తా..

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి రాసలీలల సీడీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే అంశాన్ని ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయాన్ని తీసుకుంటామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. జయమహల్‌లోని నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీడీ తయారీ వెనుక కొందరి హస్తం ఉందంటూ మాజీ మంత్రి రమేశ్‌ ఇప్పటికే తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. సీబీఐ దర్యాప్తుతోనే దాని వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు వెలుగులోకి వస్తాయనేది ఆయన అభిప్రాయమన్నారు. బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు రహస్య కార్యాచరణ నిర్వహించి సీడీ చేయడం నేరమని జ్ఞానేంద్ర పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని