logo

విద్యుదాఘాతంతో గిరిజన రైతు మృత్యువాత

పొలానికి నీరు పారించేందుకు వెళ్లిన ఓ గిరిజన రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని రేకులపల్లితండా శివారులో చోటు చేసుకుంది.

Published : 20 Jan 2023 06:14 IST

వసరాంనాయక్‌

కోడేరు, న్యూస్‌టుడే : పొలానికి నీరు పారించేందుకు వెళ్లిన ఓ గిరిజన రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని రేకులపల్లితండా శివారులో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రేకులపల్లి తండాకు చెందిన రైతు కేతావత్‌ వసరాంనాయక్‌ (58) పొలంలో వరి నాట్ల కోసం కరిగెట చేయించాడు.  రాగుల (తైదలు) పంటకు నీరు పారబెట్టాక విద్యుత్తు మోటార్‌ వద్ద మృతి చెందాడు. స్టార్టర్‌కు విద్యుత్తు సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించని రైతు బంద్‌ చేయడానికి వెళ్లి మృతి చెంది ఉంటాడని కుటుంబికులు తెలిపారు. వసరాంనాయక్‌కు భార్య, కుమారులు, కూతురు ఉన్నారు. కుటుంబికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రావుల రమేశ్‌

కందనూలు, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం నాగర్‌కర్నూల్‌ మండలంలోని మల్కాపూర్‌ గేట్‌ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చింతలపల్లి మండలం గోడుకొండ్ల గ్రామానికి చెందిన రావుల రమేశ్‌ (34) స్టీల్‌ సామగ్రి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఇటీవల సోదరుడు రావుల సత్యనారాయణ మృతి చెందగా నెల వారీ పూజా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వనపర్తికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో మండలంలోని మల్కాపూర్‌ గేట్‌ వద్దకు రాగానే నాగర్‌కర్నూల్‌ నుంచి తాడూరు వైపు వస్తున్న బొలెరొ, ద్విచక్ర వాహనం ఎదురుఎదురుగా ఢీ కొన్నాయి. ప్రమాదంలో రమేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని పట్టణంలోని జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. రావుల రమేశ్‌ అవివాహితుడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.


బావిలో పడి లారీ డ్రైవర్‌...

జమ్మికుంట, న్యూస్‌టుడే : లారీలో ఇసుక లోడింగ్‌కు వచ్చిన మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం జల్‌గడ్డ తండాకు చెందిన డ్రైవర్‌ కిషన్‌ (60)  కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఇసుక క్వారీ సమీప బావిలో పడి మృతి చెందారు. పోలీసులు, కిషన్‌ తనయుడు సురేశ్‌ కథనం ప్రకారం.. ఇసుకను తీసుకెళ్లడానికి కిషన్‌ షాద్‌నగర్‌ నుంచి బుధవారం లారీ తీసుకుని తనుగుల ఇసుక క్వారీకి వచ్చారు. గురువారం ఉదయం కుమార్తెతో చరవాణిలో మాట్లాడారు. మధ్యాహ్నం ఆయన మృతదేహం క్వారీ సమీపంలోని బావిలో తోటి డ్రైవర్లు గుర్తించారు. విషయం తెలిసి ఏఎస్సై రాధాకిషన్‌ సంఘటన స్థలానికి చేరుకుని కిషన్‌ కుటుంబసభ్యులకు సమాచారమివ్వగా కుమారుడు సురేశ్‌ సాయంత్రం జమ్మికుంటకు చేరుకున్నారు. చనిపోయింది తన తండ్రియేనని ధ్రువీకరించారు. కాగా ఇసుక లోడింగ్‌కు వచ్చిన డ్రైవర్‌ బావిలో ఎలా పడ్డారో స్పష్టం కావడం లేదు. కుటుంబసభ్యుల నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని జమ్మికుంట సీఐ రాంచందర్‌రావు చెప్పగా, శుక్రవారం తల్లి లక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు వచ్చాకే ఫిర్యాదు చేస్తానని సురేశ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని