logo

ఉరకలెత్తిన వృషభ రాజాలు

పట్టణంలోని శ్రీచౌడేశ్వరీదేవి జాతర సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.

Published : 23 Jan 2023 04:13 IST

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

సీనియర్స్‌ విభాగం పోటీల్లో బండలాగుతున్న వృషభాలు

పెబ్బేరు, న్యూస్‌టుడే : పట్టణంలోని శ్రీచౌడేశ్వరీదేవి జాతర సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. పోటీలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు వృషభాలను తీసుకొచ్చారు. ఆదివారం నిర్వహించిన సీనియర్‌ విభాగం పోటీలను డీసీసీ కార్యదర్శి మొగిలి సత్యారెడ్డి ప్రారంభించారు. పోటీల కన్వీనర్‌ చిదంబర్‌రెడ్డి, నిర్వాహకులు విజయవర్ధన్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన ఎద్దుల యజమానులకు పుర ఛైర్‌పర్సన్‌ కరుణశ్రీ బహుమతులు అందించారు.

పాలపళ్ల విభాగంలో.. : పాలపళ్ల విభాగం పోటీలో ఏడు జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రథమ బహుమతి ఏపీలోని నంద్యాల జిల్లాకు సుధీర్‌కుమార్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఎద్దులు దక్కించుకొన్నాయి. ద్వితీయ బహుమతి జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయవరానికి చెందిన రామచంద్రారెడ్డి ఎద్దులు, తృతీయ బహుమతికి ఇదే జిల్లాకు చెందిన చంద్రన్న ఎద్దులు ఎంపికయ్యాయి. నాలుగో బహుమతి గద్వాల జిల్లాకు చెందిన విజయలక్ష్మి, నవనీతరెడ్డి ఎద్దులు దక్కించుకొన్నాయి. అయిదో బహుమతిని కర్నూలు జిల్లా కలుగొట్లకు చెందిన గొంది బజార్‌ ఎద్దులు గెలుచుకొన్నాయి.

న్యూ కేటగిరి విభాగంలో..: న్యూ కేటగిరికి విభాగంలో తొమ్మిది జతల ఎద్దులు పాల్గొన్నాయి. తెలంగాణకు చెందిన అఖిలేష్‌రెడ్డి ఎద్దులు మొదటి బహుమతి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌కు చెందిన వెంకటేశ్వర్లు, శివకోటి వృషభరాజాలు ద్వితీయ బహుమతి, కర్ణాటక రాష్ట్రంలోని బిజినేగిరికి చెందిన కుమారస్వామి ఎద్దులు తృతీయ, కర్నూలు జిల్లా కానాపురానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు ఎద్దులు నాలుగో, నంద్యాల జిల్లాలోని రోళ్లపాడుకు చెందిన మురళీమోహన్‌ ఎద్దులు అయిదో బహుమతి సాధించాయి.

సీనియర్‌ విభాగంలో ..: సీనియర్‌ విభాగంలో 10 జతల ఎద్దులు పాల్గొనగా సూర్యాపేట జిల్లాకు చెందిన సుంకి సురేందర్‌రెడ్డి ఎద్దులు ప్రథమ బహుమతిగా రూ.70 వేలు గెలుచుకొన్నాయి. నంద్యాల జిల్లా మూడురాళ్లపల్లికి చెందిన పులిచిన ఓబుల్‌రెడ్డి ఎద్దులు ద్వితీయ బహుమతిగా రూ.60 వేలు సాధించాయి. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన గుర్నాథ్‌ ఎద్దులు తృతీయ బహుమతిగా రూ.45 వేలు, అనంతపురం జిల్లా కృష్ణాపురం గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి ఎద్దులు నాలుగో బహుమతిగా రూ.25 వేలు, కొత్తకోటకు చెందిన రామ్మోహన్‌ ఎద్దులు అయిదో బహుమతిగా రూ.15 వేలు గెలుచుకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని