logo

బడికి దూరంగా బాల్యం

బడీడు పిల్లలు ఆడుతూ.. పాడుతూ అక్షరాలు నేర్వాలి. తరగతి గదిలో అక్షరాలు దిద్ది ఉత్తమ పౌరులుగా ఎదగాలి.

Published : 03 Feb 2023 01:03 IST

జిల్లాలో 121 మంది గుర్తింపు

సర్వే చేస్తున్న సీఆర్పీ

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: బడీడు పిల్లలు ఆడుతూ.. పాడుతూ అక్షరాలు నేర్వాలి. తరగతి గదిలో అక్షరాలు దిద్ది ఉత్తమ పౌరులుగా ఎదగాలి. నేటికీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొందరు చిన్నారులు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ కారణాలతో పాఠశాలకు దూరంగా ఉంటూ పనిలో మగ్గిపోతున్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జనవరి 6 నుంచి 31వ తేదీ వరకు పాఠశాల స్థాయిలో పని చేసే క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లతో ప్రత్యేకంగా బడి బయటి పిల్లల సర్వే నిర్వహించారు. జిల్లాలో 121 మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. వీరికి ప్రత్యేక బోధన ఇప్పించి, వయస్సు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా తరగతిలో చేర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కథనం.


వలస కూలీలే అధికం

జిల్లాలో బడికి దూరంగా ఉంటున్న పిల్లల వివరాలను సమగ్ర శిక్ష అధికారులు సేకరించారు. సీఆర్పీలు వారి పరిధిలోని కాలనీలు, గ్రామాలు, తండాలలో పర్యటించి.. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇటుక బట్టీలు, వివిధ పరిశ్రమల్లో పని చేసే వారి పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎందుకు బడికి పంపడం లేదో పూర్తి వివరాలు సేకరించి ఫొటోలతో అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేశారు.


ప్రత్యేక బోధనతోనే ఫలితం

గుర్తించిన బడి బయటి పిల్లలకు ప్రత్యేక బోధన చేయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు మూడు నెలల పాటు ప్రత్యేక పుస్తకాల ద్వారా బోధిస్తారు. అనంతరం జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో సమీపంలోని ప్రభుత్వ బడిలో లేదంటే.. కస్తూర్బా పాఠశాలలో చేర్పిస్తారు. వీరు పాఠశాలల్లో చేరిన తరువాత రెగ్యులర్‌గా వెళ్తున్నారా.. లేకపోతే మళ్లీ పనుల్లోకి వెళ్తున్నారా సీఆర్పీలు ప్రత్యేక పరిశీలన చేస్తారు. రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా చదివేలా ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. బడి బయటి పిల్లలు లేని సమాజం తయారు చేయాలన్నదే లక్ష్యమని ఏఎంవో అనురాధ తెలిపారు. వీరికి ప్రత్యేకంగా బోధించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని