logo

పాలేటిపల్లి మోసపోయింది

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ఆశ పడ్డారు. ఒకరిని చూసి మరొకరు డబ్బులు కట్టారు. తొలుత కొద్దిమంది కొంతమేర లాభాన్ని ఆర్జించారు.

Published : 06 Jun 2023 03:23 IST

పీసీపల్లి, న్యూస్‌టుడే: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ఆశ పడ్డారు. ఒకరిని చూసి మరొకరు డబ్బులు కట్టారు. తొలుత కొద్దిమంది కొంతమేర లాభాన్ని ఆర్జించారు. ఇది తెలుసుకున్న పలువురు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా సుమారు ఇరవై మందికి పైగా ఒక్కరోజులోనే రూ. 20 లక్షల వరకు ఆన్‌లైన్‌ యాప్‌లో పెట్టుబడి పెట్టారు. చివరికి ఆ యాప్‌ కనిపించకపోవడంతో తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఈ సంఘటన మండలంలోని పాలేటిపల్లిలో వెలుగుచూసింది. ఒకటికి పదింతలు 30 రోజుల్లో చెల్లిస్తామని ఓ యాప్‌ నిర్వాహకులు నమ్మబలుకుతూ పంపిన సందేశాలను కొందరు నమ్మారు. పాలేటిపల్లికి చెందిన నలుగురు సభ్యులు తొలుత రూ. పది వేలు  చొప్పున పెట్టుబడి పెట్టారు. చెల్లించిన సొమ్ము తిరిగి రావడంతో విషయాన్ని మరికొందరికి తెలిపారు. కొందరు అప్పులు తెచ్చి మరీ చెల్లించారు. గత నెల 31వ తేదీ ఒక్కరోజే సుమారు 20 మంది రూ. 20 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టారు. అనంతరం నగదు వస్తుందని ఎదురుచూసినప్పటికీ ఫలితం లేకపోయింది. తీరా యాప్‌ను ఓపెన్‌ చేస్తే అది పని చేయడం లేదని తెలుసుకుని తాము నిండా మునిగామని గ్రహించారు. ఈ విషయంపై ఎస్సై నాగేశ్వరరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని