logo

అమాయకుల జీవితాలతో మావోయిస్టుల చెలగాటం

విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్న మావోయిస్టులు అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతు న్నారని ఎస్పీ గాష్‌ ఆలం అన్నారు.

Published : 10 Jun 2023 02:49 IST

వెంకటాపురం, న్యూస్‌టుడే: విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్న మావోయిస్టులు అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతు న్నారని ఎస్పీ గాష్‌ ఆలం అన్నారు. వెంకటాపురం మండలంలోని ఆలుబాకలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆశ్రమం హ్యాండ్‌ ఆఫ్‌ హోప్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆయన శిబిరాన్ని ప్రారంభించి గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సంక్షేమం, ఉన్నతి లక్ష్యంగా పోలీసుశాఖ సేవలందిస్తోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో స్నేహపూర్వక పోలీసింగ్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే నేరుగా పోలీసులను కలిసి విన్నవించాలన్నారు. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తలదాచుకుంటున్న మావోయిస్టులు ప్రజల సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అమాయకులతో అసాంఘిక కార్యకలాపాలను చేయిస్తున్నారన్నారు. నక్సల్స్‌ మాయమాటలు నమ్మి ఎవరూ తమ ఉత్తమ భవిష్యత్తును చీకటిమయం చేసుకోవద్దని సూచించారు.

1600 మందికి పరీక్షలు

స్థానిక జడ్పీఎస్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి అనూహ్య స్పందన లభించింది. మారుమూల అటవీ గ్రామాలైన కలిపాక, కొత్తగుంపు, తిప్పాపురం, పెంకవాగు, ముత్తారం, సీతారాంపురం, బోదాపురం, ఆలుబాక ప్రాంతాలకు చెందిన మహిళలు, వృద్ధులు శిబిరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంటి, దంత, స్త్రీ వైద్యనిపుణులు, జనరల్‌ ఫిజీషియన్‌ వైద్యులు గిరిజనులకు పరీక్షలు చేశారు. సుమారు 1600 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పలువురికి కంటి అద్దాలను అందజేశారు. ఎస్పీతో పాటు ఓఎస్డీ అశోక్‌కుమార్‌ కంటి పరీక్షలు చేయించుకున్నారు.

సహపంక్తి భోజనం

వైద్యశిబిరం ప్రాంగణంలో గిరిజనులకు భోజన సదుపాయం కల్పించారు. ఎస్పీ, ఓఎస్డీతో పాటు ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, జడ్పీటీసీ సభ్యురాలు పాయం రమణ, సర్పంచి పూజారి ఆదిలక్ష్మీ గిరిజన మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మండలానికి చెందిన గ్రామీణ వైద్యులు, మందుల దుకాణ సంఘం బాధ్యులు సేవలందించారు. డీఎస్పీ సుభాష్‌బాబు, సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ ధనసేలక్ష్మ, వైద్యులు జవహార్‌ కెన్నడి, భవ్యశ్రీ, వెంకటాపురం, ఏటూరునాగారం సీఐలు కె.శివప్రసాద్‌, రాజు, ఎస్సైలు తిరుపతిరావు, అశోక్‌, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని