logo

సీఎం కాన్వాయ్‌కు కారు కావాలి.. ఇవ్వండి: తిరుమల వెళ్తున్నవారిని ఆపి పోలీసు జులుం

పల్నాడు జిల్లా వినుకొండకు చెందని వేమల శ్రీనివాస్‌ కుటుంబం వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఒంగోలు నగరంలోకి వచ్చారు

Updated : 21 Apr 2022 10:14 IST


నడిరోడ్డుపై శ్రీనివాస్‌ కుటుంబం

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్‌ కుటుంబం వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఒంగోలు నగరంలోకి వచ్చారు. అలా రావడమే వారు చేసిన తప్పయింది.. స్థానిక పాత మార్కెట్‌ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్‌ చేస్తుండగా ఓ కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్‌ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు సార్‌.. మీకు సారీ చెప్పడం తప్ప మేమేమీ చేయలేమంటూ కారుతో పాటు డ్రైవర్‌ను తీసుకుని ఆ కానిస్టేబుల్‌ వెళ్లిపోయాడు.

ఏం చేయాలో అర్థంకాక రాత్రివేళ నడిరోడ్డుపై నిలుచుండిపోయారు ఆ కుటుంబీకులు. సీఎం కాన్వాయ్‌కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి, అందునా మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న వారి వాహనాలు లాక్కుని రోడ్డుపాలు చేయడం ఏమిటని వాపోయారు. ఊరుకాని ఊళ్లో తమకు ఇప్పటికిప్పుడు తిరుమల వెళ్లేందుకు వాహనం ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వస్థలానికి వెళ్లేందుకు కూడా వాహనం దొరికే పరిస్థితి లేదన్నారు. దీనిపై సీఐ సుభాషిణి వద్ద న్యూస్‌టుడే ప్రస్తావించగా ఇప్పటిదాకా తన దృష్టిలో ఈ విషయం లేదన్నారు. బాధితులు ఇప్పటికీ అక్కడే ఉంటే వారి కోసం తమ రక్షక్‌ వాహనాన్ని పంపించి వారి నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలకు దూరప్రాంతాలకు వెళ్లే వారి వాహనాలను సేకరించరని ఆమె స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని