
HYD Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకపై 6 గంటల నుంచే!
హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) వేళల్లో మార్పులు చేసింది. రేపటి ( నవంబర్ 10) నుంచే ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మెట్రో సేవలు పొడిగించాలని మంత్రి కేటీఆర్ను ఓ ప్రయాణికుడు కోరడంతో దానికి మంత్రి సానుకూలంగా స్పందించి మెట్రో ఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో వేళ్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.
అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ఉదయం వేళ మెట్రోరైలు ఫ్లాట్ఫామ్ల వద్ద రైళ్ల కోసం ఎదురు చూస్తున్న జనం రద్దీ, వృద్ధులు, మహిళలు పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి రాష్ట్ర మంత్రి కేటీఆర్కు ట్విటర్ ద్వారా సోమవారం ట్యాగ్ చేశారు. తెల్లవారుజామునే నగరానికి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు సరిగాలేక ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6 నుంచే మెట్రోరైళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అభినవ్ మాటలతో ఏకీభవిస్తున్నట్టు రీట్వీట్ చేశారు. మెట్రో ఎండీ స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనికి మెట్రో ఎండీ సైతం సానుకూలంగా స్పందించారు. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నగరవాసుల కల నెరవేరినట్లయ్యింది.