ప్రియురాలి ఇంటి నుంచి.. పాకిస్థాన్‌లోకి

ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చే క్రమంలో పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది.

Published : 29 Jan 2021 01:58 IST

పాకిస్థాన్‌లో చిక్కుకున్న రాజస్థాన్‌ యువకుడు

సత్వరం తీసుకురావాలని కోరుతున్న బంధువులు

జైపూర్‌: ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చే క్రమంలో పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెమ్రా రామ్‌ మేఘ్‌వల్‌(19) అనే యువకుడు భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో గల కుంహారో కా టిబ్బా ప్రాంతంలో నివసిస్తున్నాడు. 2020 నవంబరులో అతడు తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఆమె తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రావడంతో అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అలా పారిపోతూ పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌ అధికారులు అతణ్ని అరెస్టు చేసినట్లు రాజస్థాన్‌ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సదరు యువకుణ్ని పాకిస్థాన్‌లో ఎన్ని చిత్ర హింసలు పెడుతున్నారోనని అతడి కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు.

గత నవంబరులో మేఘ్‌వల్‌ కన్పించడంలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతణ్ని వీలైనంత త్వరలో భారత్‌కు తీసుకురావాలని కోరుతూ గురువారం స్థానిక భాజపా నాయకులతో కలిసి జిల్లా కలెక్టరును కలిశారు. సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్‌) చెందిన ఓ అధికారి ఈ కేసును పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘‘పాకిస్థాన్‌ రేంజర్లతో అనేక సార్లు సమావేశాలు జరిగిన తర్వాత మేఘ్‌వల్‌ సింధ్‌ పోలీసుల అధీనంలో ఉన్నాడని వారు తెలిపారు. చట్టపరమైన చర్యలు పూర్తైన తర్వాత అతణ్ని భారత్‌కు అప్పగిస్తామన్నారు. అతడు భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాతే పాకిస్థాన్‌లోకి ఏ విధంగా ప్రవేశించాడన్న విషయం తెలుస్తుంది.’’ అని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి..

నిరసనలు ఆపండి..రోడ్లు ఖాళీ చేయండి..

ఆ చర్య లైంగిక వేధింపుల కిందకు రాదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు