విలువలే ఆస్తి.. అదేంటో తెలుసుకోండి మరి!

ఆస్తుల కోసం కుటుంబాలే చీలిపోతున్న రోజులివి. తండ్రి కుమారులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తుల కోసం గొడవలు పడుతున్న ఈ రోజుల్లో మానవత్వం అన్న పదమే కనుమరుగైంది.

Published : 02 Jan 2021 00:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్తుల కోసం కుటుంబాలే చీలిపోతున్న రోజులివి. తండ్రి కుమారులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తుల కోసం గొడవలు పడుతున్న ఈ రోజుల్లో మానవత్వం అన్న పదమే కనుమరుగైంది. ఇలాంటి తరుణంలో తన తండ్రి తాకట్టుగా తీసుకున్న రూ.లక్షల విలువైన పొలాన్ని రైతు కుటుంబానికే ఇచ్చేశాడు ఓ వడ్డీ వ్యాపారి. మానవత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచాడు ఆ మధ్యప్రదేశ్‌ వాసి. 

డబ్బే జీవితం కాదని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వడ్డీ వ్యాపారి నిరూపించాడు. మధ్యప్రదేశ్‌లోని భీండ్‌ జిల్లా ఘనౌలి గ్రామానికి చెందిన హరిఓం సింగ్‌ భదౌరియా అనే వడ్డీ వ్యాపారి డబ్బు కంటే మానవత్వానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. తన తండ్రి తాకట్టుగా తీసుకున్న భూమిని పేద రైతుకు తిరిగి ఇచ్చేసి విశాల హృదయాన్ని చాటుకున్నాడు. హరిఓం సింగ్‌ భదౌరియా తన తండ్రి జనక్‌సింగ్‌ నుంచి వారసత్వంగా వచ్చిన వడ్డీ వ్యాపారంతో పాటు వ్యవసాయం కూడా చేస్తున్నాడు. 1970లో జనక్‌ సింగ్‌ వద్ద  శరవణ్‌ సింగ్‌ అనే పేద రైతు తన వ్యవసాయ భూమిని తాకట్టు పెట్టి రూ.1300 అప్పు తీసుకున్నాడు. పేదరికం వల్ల అసలు కాదు కదా వడ్డీ కూడా చెల్లించలేకపోయాడు. కాలక్రమంలో అప్పు ఇచ్చిన జనక్‌సింగ్‌, తీసుకున్న శరవణ్‌ సింగ్‌ చనిపోయారు. శరవణ్‌ సింగ్‌కు ముగ్గురు కుమారులు కాగా వారు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలీ చాలని ఆదాయంతో పేదరికంలో గడుపుతున్నారు. వారి పరిస్థితిని తెలుసుకొని చలించిపోయిన హరిఓం సింగ్‌ తన ఔదార్యం చాటుకున్నారు. 50ఏళ్ల క్రితం శరవణ్‌ సింగ్‌ తన తండ్రి వద్ద తనఖా ఉంచిన భూమిని ఒక్క పైసా తిరిగి తీసుకోకుండా ఆయన ముగ్గురు కుమారులకు తిరిగి ఇచ్చేశాడు. తానే ఖర్చులు భరించి ఆ భూమిని వారి పేర్ల మీద రిజిస్ర్టేషన్‌ చేయించారు. హరిఓం సింగ్‌ చేసిన ఈ పనికి శరవణ్‌ సింగ్‌ కుమారులు ఉప్పొంగి పోతున్నారు. తిరిగి ఇచ్చిన భూమి విలువ సుమారు రూ.20లక్షలు. శరవణ్‌ సింగ్‌ కుమారులతో పాటు దేశవ్యాప్తంగా రైతుల కష్టాలను చూసి భూమిని తిరిగి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హరిఓంసింగ్‌ ఔదార్యం చూసి అక్కడి గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదంతా చూశాక ఎవరైనా విలువలే ఆస్తి అనాల్సిందే మరి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని