Telangana news: పోలీసు నియామకాలు.. 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది. వీటిలో ఎస్సై పోస్టులకి 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు నియామక...

Updated : 16 Nov 2022 17:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది. వీటిలో ఎస్సై పోస్టులకి 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు నియామక మండలి తెలిపింది. 3.55 లక్షల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తేదీల్లో ఏమైనా మార్పులు ఉంటే ముందే ప్రకటిస్తామని నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రావు తెలిపారు.

మొత్తం దరఖాస్తుల్లో.. 7.65% ఓసీలు, 8.27% బీసీ (ఏ), 17.7% బీసీ (బీ), 0.26% బీసీ (సీ), 20.97% బీసీ (డీ), 4.11% బీసీ (ఈ), 22.44 % ఎస్సీ, 18.6% ఎస్టీ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు నియామక మండలి తెలిపింది. తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్యర్థులు, ఆంగ్లంలో పరీక్ష రాసేందుకు 32.8 శాతం మంది ఆప్షన్‌ ఎంచుకున్నట్లు నియామక మండలి తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని