
TS News: తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ను మరచిపోలేరు: బాలకృష్ణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఆయనను మరచిపోలేరు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారు. మాట తప్పని ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం. తెలుగు ఖ్యాతిని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. బడుగు బలహీన వర్గాల, పీడిత ప్రజలకు పదవులు ఇచ్చారు.
తెలంగాణలో 610జీవో తీసుకొచ్చింది..ఎన్టీఆరే. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని 610జీవోలో అమలు చేశారు. స్థానికతపై ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారు’’ అని బాలకృష్ణ అన్నారు. నందమూరి రామకృష్ణ, సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు.