
CM Jagan: రాబడి తగ్గినా ప్రజలకు ఏదీ ఆపలేదు: జగన్
అమరావతి: పేదలకు అండదండలు అందించే విషయంలో ఏమాత్రం రాజీలేదని సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గినా ప్రజలకు ఏదీ ఆపలేదని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. అర్హత ఉండి మిగిలి పోయిన వారికి నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు. అర్హత ఉన్నా ఏదైనా కారణంతో వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందని 9,30,809 మంది ఖాతాల్లో సీఎం రూ.703కోట్లను జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని విడుదల చేశారు.
‘‘అందరికీ న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వ బకాయిలు కూడా కలిపి చెల్లిస్తున్నాం. 2019- 20రబీకి సంబంధించి రూ.9కోట్లు జమ చేస్తున్నాం. పొదుపు సంఘాలకు మరో రూ.53కోట్లు, జగనన్న వసతి దీవెన పథకంలో రూ.39కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకంలో రూ.19కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో రూ.19కోట్లు జమ చేస్తున్నాం’’ అని జగన్ చెప్పారు. వీటితో పాటు వాహనమిత్ర, మత్స్యకార భరోసా, నేతన్ననేస్తం తదితర పథకాలకు సంబంధించి అర్హుల ఖాతాల్లో నగదు జమ చేశారు.