Ts News: విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

తెలంగాణలోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలువులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై  ఉన్నత స్థాయి...

Updated : 04 Jan 2022 12:56 IST

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సూచించారు. కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వ సన్నద్ధత సహా తదితర అంశాలపై చర్చించారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ అక్కర్లేదని అధికారులు నివేదిక ఇచ్చినట్లు సీఎం తెలిపారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, పరీక్ష కిట్లు, మందులు సమకూర్చుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బస్తీ దవాఖానాలను నగరపాలికల్లో విస్తరించాలని సీఎం ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాలు పెంచాలని, హెచ్‌ఎండీఏ పరిధిలో వార్డుకొకటి చొప్పున ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో 99 శాతం పడకలు ఆక్సిజన్‌ బెడ్లుగా మార్పు చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన వాటిని వెంటనే ఆక్సిజన్‌ పడకలుగా మార్చాలని సూచించారు. ఆక్సిజన్‌ ఉత్పత్తిని 500 టన్నుల వరకు పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. హోం ఐసోలేషన్‌ కిట్లను కోటి వరకు, పరీక్ష కిట్లను రెండు కోట్లకు పెంచాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని సూచించారు. కిడ్నీ రోగుల కోసం మరిన్ని డయాలిసిస్‌ మిషన్లు పెంచాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని.. మాస్కు తప్పనిసరిగా ధరించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా గుంపులుగా ఉండరాదని.. బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 

రేపట్నుంచి రాష్ట్రంలో సీరో సర్వే

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మరోసారి సీరో సర్వే చేయనున్నారు. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించనున్నారు. రక్తంలో యాంటీబాడీల అభివృద్ధిపై అధ్యయనం కోసం ఈ నెల 4 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి జిల్లాలోని 10 గ్రామాల చొప్పున ఎంపిక చేసి సర్వే చేస్తారు. 16వేల మంది నమూనాలతో అధ్యయనం చేస్తారు. వైరస్‌ని ఎదుర్కొనేందుకు జనంలో ఎంత మేరకు నిరోధకత పెరిగిందనే అంశం ఈ సర్వేలో తెలుస్తుంది.

విభజన అంశాలపై అనుసరించాల్సిన విధానాలపై సీఎం సూచనలు 
విభజన అంశాలపై ఈనెల 12న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా భేటీలో అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న విషయం తెలిపాలని సీఎం సూచించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు