Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jun 2023 09:15 IST

1. కాగజ్‌నగర్‌కు వందే భారత్‌ రైలు!

సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ స్టేషన్ల మధ్య వందే భారత్‌ రైలు నడిపేందుకు రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే ఆ మార్గంలో రెండుసార్లు టయల్‌ రన్‌(ప్రయోగాత్మక పరిశీలన) చేపట్టగా విజయవంతమైంది. దాదాపు 580 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో రోజుకు దాదాపు 50పైనే సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం గరిష్ఠంగా పది గంటలపైనే సమయం పడుతుండగా, వందే భారత్‌తో అయిదు నుంచి ఆరు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘గోరుముద్ద’ గ్లాసులపైనా జగనన్న పేరే!

వైకాపా ప్రభుత్వ ప్రచార దాహానికి ఇళ్లు, గుళ్లూ చాలడం లేదు. ఇప్పుడు ఏకంగా విద్యార్థులకు ఇవ్వనున్న గ్లాసులపై కూడా ‘జగనన్న..’ పేరే కనిపిస్తోంది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు గ్లాసులను సరఫరా చేయాలని చూస్తోంది. ఇప్పటికే మండల కేంద్రాలకు గ్లాసులు వచ్చాయి. వాటిపైనా ‘జగనన్న గోరుముద్ద’ అని ముద్రించారు. విద్యార్థులకు అందించే వాటిపైనా ఇలా పేర్లేంటని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డిగ్రీలో సైబర్‌ సెక్యూరిటీ కోర్సు.. ఇకపై ప్రతి విద్యార్థి చదవాల్సిందే

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇకపై ప్రతి విద్యార్థి సైబర్‌ సెక్యూరిటీ కోర్సు (నాలుగు క్రెడిట్లుగా)ను అదనంగా చదవాల్సి ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల మదింపునకు పరీక్షల నిర్వహణ విధానాన్ని, ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్నీ కొత్త విధానంలో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆర్‌.లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రేపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష.. 15 నిమిషాల ముందు గేట్ల మూసివేత

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆదివారం (ఈనెల 11న) నిర్వహించే రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని ప్రకటించింది.ఈమేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లతో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘సముద్ర గర్భంలో’ కేబుల్‌ యుద్ధం!

అంతర్జాతీయ వాణిజ్యం, సిలికాన్‌ చిప్స్‌, 5జీ టెక్నాలజీ, ఖనిజ గనులు, కృత్రిమ మేధ, అంతరిక్ష యానం, సముద్ర జలాలు...ఇలా ప్రతిరంగంలోనూ పోటీ పడుతున్న అమెరికా, చైనా ఆధిపత్య యుద్ధం ఇప్పుడు సముద్ర గర్భంలోకీ చేరింది. సమాచార విప్లవ వారధులైన సముద్రంలోని ఇంటర్నెట్‌ కేబుళ్లపై పెత్తనానికి ఈ రెండుదేశాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. సామదానభేద దండోపాయాలను ప్రయోగించిన అమెరికా... ఈ ప్రాజెక్టు నుంచి చైనా కంపెనీలను తప్పించి తమ దేశ కంపెనీకి కట్టబెట్టుకోవటంలో సఫలమైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పొట్టిగా ఉన్నందున పెళ్లి కావట్లేదని ఆత్మహత్య

ఎత్తు తక్కువగా ఉన్న కారణంగా ఇప్పటికి మూడు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయన్న బెంగతో ఝార్ఖండ్‌లోని రాంచీ సమీప పుండగ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో శ్వేత (22) అనే యువతి ఆత్మహత్య చేసుకొంది. మూడు సందర్భాల్లోనూ చివరిదాకా వచ్చి, కేవలం తాను పొట్టిగా ఉన్న కారణంగా సంబంధాలు వెనక్కు వెళ్లిపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. కుటుంబసభ్యులు ఎంతగా నచ్చజెప్పినా ఆ బాధలో నుంచి శ్వేత కోలుకోలేకపోయింది. తల్లిదండ్రులు బిహార్‌లోని అరవల్‌లో ఉంటారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మదుపరులు వాడని సొమ్ము.. ఏ రోజుకారోజు వెనక్కి ఇవ్వండి

స్టాక్‌ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయడానికి మదుపరులు స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలకు బదిలీ చేసే నిధులకు సంబంధించి సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌  ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) సరికొత్త నిబంధనలను నిర్దేశించింది. ఈ నిబంధనల ప్రకారం మదుపర్ల సొమ్ము స్టాక్‌ బ్రోకర్ల వద్ద ఉండటానికి వీల్లేదు. ఏ రోజుకారోజు మిగులు నిధులను స్టాక్‌ బ్రోకర్లు మదుపరులకు వెనక్కి ఇవ్వాల్సిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిర్మాణంలో ఉన్న ఇళ్ల ధరల్లో పెరుగుదల

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ) 2023 మార్చితో ముగిసిన త్రైమాసికానికి రెసిడెక్స్‌ను విడుదల చేసింది. హౌసింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(హెచ్‌పీఐ) 2017-18 ఆర్థిక సంవత్సరం ఆధారంగా త్రైమాసిక ప్రాతిపదికన దేశంలోని ఎంపిక చేసిన 50 నగరాల్లో నివాస స్థిరాస్తుల ధరల కదిలికను ట్రాక్‌ చేసింది. పెరుగుతున్న నిర్మాణ వ్యయం స్థిరాస్తుల ధరలపై ప్రభావం చూపుతోందని తెలిపింది. నివేదికలో ముఖ్యంశాలను పరిశీలిస్తే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మాతృమూర్తి కోసం ప్రత్యేక స్మారక మందిరం

తల్లి కోసం ఓ కుమారుడు నిర్మించిన స్మారక మందిరాన్ని స్థానికులు ఆసక్తితో తిలకిస్తున్నారు. తిరువారూరు జిల్లా అమ్మైయప్పన్‌ ప్రాంతానికి చెందిన షేక్‌దావూద్‌-జైలానీ బీవీ దంపతులకు కుమారుడు అమరుద్దీన్‌, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పారిశ్రామిక వేత్త అయిన అమరుద్దీన్‌ చెన్నైలో నివశిస్తున్నారు. తండ్రి 20 ఏళ్ల క్రితం చనిపోగా, తల్లి 2020లో మృతి చెందింది. కన్నవారి పేరిట సొంత గ్రామంలో పేదలకు సాయం చేసేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రైలెక్కాలన్నా.. దిగాలన్నా గోడే దిక్కు!

ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కాలన్నా.. దిగాలన్నా గోడ ఎక్కాల్సిందే. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నా ఇటు రైల్వే అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. చాలా కాలంగా ఈ సమస్య ఎదుర్కొంటున్నా పరిష్కారం దిశగా అడుగులు పడటంలేదు. స్టేషన్‌లో రెండో నంబరు ప్లాట్‌ఫాం దెబ్బతింది. కొత్తగా మూడోలైన్‌ వేయడంతో రెండు, మూడు లైన్లకు కలిపి కొత్త ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టి ఇటీవల ఈ పనులు నిలిపివేశారు. విశాఖ వైపు వైళ్లే రైళ్లు రెండు, మూడు లైన్లలో ఆగుతాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని