TS Group-1: రేపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష.. 15 నిమిషాల ముందు గేట్ల మూసివేత

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆదివారం (ఈనెల 11న) నిర్వహించే రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది.

Updated : 10 Jun 2023 08:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆదివారం (ఈనెల 11న) నిర్వహించే రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని ప్రకటించింది.ఈమేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లతో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలి.

2.75 లక్షల మంది డౌన్‌లోడ్‌...

గ్రూప్‌-1 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రాల లీకేజీతో పరీక్షను రద్దుచేసిన కమిషన్‌ ఆదివారం పునఃపరీక్ష నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 2.75 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాలను కమిషన్‌ ఏర్పాటుచేసింది. అభ్యర్థికి ఇచ్చిన ప్రశ్నపత్రం ఇతర భాషలో ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌ను సంప్రదించి మరొకటి తీసుకోవాలని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఓఎంఆర్‌పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలని, దాని ప్రకారమే కీ ఆధారంగా వాల్యుయేషన్‌ జరుగుతుందని పేర్కొన్నాయి.

పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: సీఎస్‌ శాంతికుమారి

గ్రూప్‌-1 నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లుచేసి పరీక్ష సాఫీగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లను సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. గ్రూప్‌-1 పరీక్షలు... సుపరిపాలన, సాహిత్య దినోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శనివారం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా  జిల్లా, రెవిన్యూ డివిజన్లలో, మండల కేంద్రాల్లో సభలు ఏర్పాటుచేయాలన్నారు. ఆదివారం సాహిత్య దినోత్సవం సందర్భంగా జిల్లా, మండల కేంద్రాల్లో వివిధ కార్యక్రమాల్ని నిర్వహించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు