AP High court: ఏపీ హైకోర్టు తరలింపు న్యాయస్థానాల పరిధిలోనే: కేంద్ర ప్రభుత్వం

ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనే ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ఈమేరకు రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Updated : 23 Mar 2023 17:24 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేసింది. కర్నూలుకు తరలిచాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 214 నిబంధన, 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటైందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని గుర్తు చేశారు. సీఎం మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయని పేర్కొన్నారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని