అగ్గి చల్లారిందా..? రాహుల్‌-ఉద్ధవ్‌ మధ్య ‘సావర్కర్‌ వివాదం’ సద్దుమణిగిందా..?

సావర్కర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇప్పుడు ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. 

Published : 28 Mar 2023 18:07 IST


ముంబయి: మహారాష్ట్ర(Maharashtra)లోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, శివసేన(యూబీటీ) మధ్య హిందూ సిద్ధాంత కర్త సావర్కర్‌ అంశం అగ్గి రాజేసింది. ‘మా దేవుడైన సావర్కర్‌ను అవమానిస్తే ఊరుకోం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) మండిపడ్డారు. అయితే ఇప్పుడు సావర్కర్ విషయంలో వచ్చిన అభిప్రాయభేదం తొలగిపోయినట్లు తెలుస్తోంది. 

‘మేం రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో మాట్లాడాం. మా పోరాటం మోదీతో.. సావర్కర్‌తో కాదు’ అని ఉద్ధవ్‌ వర్గం శివసేన నేత సంజయ్‌ రౌత్ వెల్లడించారు. దీనిపై రాహుల్‌.. ఉద్ధవ్‌కు ఫోన్ చేశారని చెప్పారు. ‘నిన్న సమావేశంలో మంచి విషయాలు చర్చించుకున్నాం. మా బంధం మెరుగ్గా ఉంటుంది’ అని సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సావర్కర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తమ కూటమికి చీలిక తెస్తుందని వ్యాఖ్యానిస్తూ.. ఉద్ధవ్‌ ఠాక్రే ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇదిలా ఉంటే..ఈ సమావేశానికి హాజరైన 17 ప్రతిపక్షపార్టీలు సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ఇందులో నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. 

మహారాష్ట్రలోని ఎంవీఏలో కాంగ్రెస్‌, శివసేన ఉద్ధవ్‌ వర్గం, ఎన్సీపీ భాగస్వామ్య పక్షాలు. ఈ వ్యాఖ్యల వల్ల తమ బంధానికి బీటలు రావొచ్చని ఉద్ధవ్‌(Uddhav Thackeray) నిన్న కాస్త ఘాటుగానే స్పందించారు. పరువు నష్టం కేసులో జైలు శిక్ష, లోక్‌సభకు అనర్హత వేటు అనంతరం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ మాట్లాడుతూ ‘నా పేరు సావర్కర్‌ కాదు.. క్షమాపణ కోరన’న్న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గే నివాసంలో ప్రతిపక్ష నేతలు కలుసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని