సోషల్ మీడియా సంస్థలకు ట్రంప్‌ హెచ్చరిక!

ట్రంప్‌ ట్వీట్లపై ట్విటర్‌ చేపట్టిన ఫ్యాక్ట్‌చెక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తన భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించిందని ట్విటర్‌పై విరుచుకుపడ్డారు.

Published : 28 May 2020 13:32 IST

ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై త్వరలోనే సంతకం..

వాషింగ్టన్‌: ట్రంప్‌ ట్వీట్లపై ట్విటర్‌ చేపట్టిన ఫ్యాక్ట్‌చెక్‌ను‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా పరిగణించారు. ఇది తన భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించే విషయమని విరుచుకుపడ్డారు. రిపబ్లికన్లను అణచివేయడానికే కొందరు ప్రయత్నిస్తున్నట్లు నమ్ముతున్నట్లు ప్రకటించారు.  సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు ఉంటాయని ట్రంప్‌ స్పష్టంచేశారు. సోషల్‌ మీడియాను తప్పకుండా నియంత్రిస్తామని హెచ్చరించారు. 2016లో కూడా తనపై ఇదే తరహాలో ప్రయత్నించి సామాజిక మాధ్యమాలు విఫలం అయ్యాయని.. ఈసారి వాటి ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై త్వరలోనే ట్రంప్‌ సంతకం చేయనున్నట్లు వైట్‌హౌజ్‌ అధికార ప్రతినిధి తాజాగా వెల్లడించారు.

ట్విటర్‌ను విమర్శించిన ఫేస్‌బుక్‌ సీఈవో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్లను ఫ్యాక్ట్‌చెక్‌ చేసే విషయంలో ట్విటర్‌ను ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ కూడా తప్పుబట్టారు. సామాజిక మాధ్యమాలు ‘నిజ నిర్ధారకులు’ కాకూడదని ట్విటర్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ విషయంలో ట్విటర్‌తో పోలిస్తే ఫేక్‌బుక్‌ విభిన్న పాలసీని అనుసరిస్తుందని ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూకర్‌బర్గ్‌ వెల్లడించారు. ప్రజలు ఆన్‌లైన్‌లో వ్యక్తం చేసే అభిప్రాయాలకు ప్రైవేటు కంపెనీలు నిజనిర్ధారకులుగా ఉండకూడదన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల సంస్థలు ఈ పని చేయకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ‘మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్‌’ అవలంభిస్తే అక్రమాలు జరిగే అవకాశం ఉందని ట్రంప్‌చేసిన అరోపణల్లో నిజమెంతో తెలుసుకోవాలని ట్విటర్‌ తాజాగా నెటిజన్లకు సూచించడం చర్చకు దారితీసింది.

మేము అదే కొనసాగిస్తాం: ట్విటర్‌
ట్విటర్‌ ఫ్యాక్ట్‌చెక్‌ ప్రకటనపై అంతర్జాతీయంగా వస్తున్న వార్తలకు ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సే స్పందించారు. ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యల్ని, అసత్య సమాచారాన్ని గుర్తించి ప్రజల ముందుంచడం వల్ల.. వారే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుదనేది తమ భావన అని జాక్‌ డోర్సే స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాజిక మాధ్యమాల తీరు, ట్రంప్‌ వైఖరి మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని