Black fungus: కొత్త మార్గదర్శకాలివే..

ప్రాణాంతక కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్‌ ఫంగస్‌. పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటికే దీంతో 90 మంది మరణించారు. రాజస్థాన్‌లో 100కు పైగా కేసులు నమోదవడంతో దీనిని అంటువ్యాధుల జాబితాలో చేర్చారు.

Published : 20 May 2021 14:37 IST

సూచించిన ఎయిమ్స్‌, దిల్లీ

దిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్‌ ఫంగస్‌. పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటికే దీంతో 90 మంది మరణించారు. రాజస్థాన్‌లో 100కు పైగా కేసులు నమోదవడంతో దీనిని అంటువ్యాధుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) బ్లాక్‌ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎలాంటి సందర్భాల్లో ఈ ఫంగస్‌ సోకుతుంది, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై పలు సూచనలు చేసింది.

ఎవరికి ముప్పు ఎక్కువగా ఉంటుందంటే..

> మధుమేహం అదుపులో లేనివారు, బాగా స్టెరాయిడ్స్‌ తీసుకొనేవారు

> రోగ నిరోధక మందులు, యాంటీ క్యాన్సర్‌ చికిత్స తీసుకొనేవారు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారు

> చాలా కాలంపాటు స్టెరాయిడ్స్‌ తీసుకొనేవారు

> కరోనా తీవ్రమై, ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ సపోర్టుతో ఉండి, కోలుకున్న వారికి బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ముప్పు ఉంటుందని ఎయిమ్స్‌ వెల్లడించింది. బాధితులు వైద్యుల సలహాతో తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

ఈ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు ఏంటంటే..?

ముక్కు నుంచి నల్లటి స్రావాలు, రక్తం కారడం

ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, కంటినొప్పి, కంటి చుట్టూ వాపు, ఎర్రగా అవడం, దృష్టి కోల్పోవడం, కన్ను మూసి తెరవడంలో ఇబ్బందులు

ముఖం తిమ్మిరిగా అనిపించడం

నోరు తెరవడం, నమలడంలో సమస్యలు

దంతాలు వదులుగా అనిపించడం, నోటి లోపలి ప్రాంతాల్లో వాపు 

ఎవరికి వారు తరచుగా ముఖాన్ని పరీక్షించుకోవాలని ఎయిమ్స్‌ సూచించింది. ముఖంలో వాపు రావడం, కంటి కింద, ముక్కు, చెంపల భాగాల్లో నలుపు రంగు ఉందేమో చూసుకోవాలి. ఎక్కడైనా ముట్టుకుంటే నొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇన్‌ఫెక్షన్‌ ఉన్నపుడు ఏం చేయాలంటే?

* వెంటనే చెవి-ముక్కు-గొంతు(ఈఎన్‌టీ) వైద్యులను సంప్రదించాలి

* రక్తంలో గ్లూకోజ్‌ను పరిశీలిస్తూ, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.

* వైద్యులు సూచించిన ఔషధాలనే వాడాలి. సొంతవైద్యం చేసుకోకూడదు.

* వైద్యుల సూచన మేరకు అవసరమైనపుడు మాత్రమే ఎమ్మారై, సీటీ స్కాన్‌లు చేయించాలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని