Nuclear Bomb: మన సత్తాపై ‘అణు’మానాలు తీరిన రోజు

భారత్‌ అణు బాంబు తయారుచేస్తే గడ్డి తిని.. అవసరమైతే పస్తులుండైనా మేమూ అణు బాంబును తయారుచేస్తాం.

Updated : 18 May 2024 08:00 IST

పోఖ్రాన్‌-1 పరీక్షకు 50 ఏళ్లు

భారత్‌ అణు బాంబు తయారుచేస్తే గడ్డి తిని.. అవసరమైతే పస్తులుండైనా మేమూ అణు బాంబును తయారుచేస్తాం. అంటూ భారత్‌ పరీక్షలు నిర్వహించడానికి 9 ఏళ్ల ముందే ప్రకటించిన పాక్‌.. ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది.


1974 మే 18

భారత దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ప్రపంచ యవనికపై మన దేశం సాంకేతిక సత్తా చాటిన రోజు. యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పొరుగు దేశాలకు గట్టి సందేశం పంపిన రోజు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు భారత్‌ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా, సోవియట్‌ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన సగర్వంగా నిలిచింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంలేని దేశం అణు పరీక్ష నిర్వహించడం అదే మొదటిసారి. దీనిపై అగ్గిమీద గుగ్గిలమైన కొన్ని అగ్రరాజ్యాలు ఆంక్షలతో అక్కసు వెళ్లగక్కాయి. అయినా మన దేశం నిలదొక్కుకుంది. సాంకేతిక పురోగతితో ముందడుగు వేసింది. 


అణ్వస్త్రాల అభివృద్ధి ఎందుకు?

భారత్‌ అణు పరీక్షకు పూనుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. 1962లో మన దేశంపై చైనా దురాక్రమణకు పాల్పడింది. అక్సాయ్‌చిన్‌ ప్రాంతాన్ని ఆక్రమించింది. 1964లో అణ్వస్త్రాన్ని పరీక్షించింది. ఇది భారత్‌ను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే సంప్రదాయ ఆయుధాల విషయంలో మనకన్నా పైచేయి సాధించిన ప్రత్యర్థి.. అణ్వస్త్రం విషయంలోనూ ముందంజలో ఉన్నట్లు గుర్తించింది. 

ఇటు పక్క పాకిస్థాన్‌ రూపంలోనూ మరో శత్రుదేశం భారత్‌కు ఉంది. 1965 నాటికి ఆ దేశంతో రెండు యుద్ధాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు దీటుగా రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకొని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్నది లక్ష్యం. దీన్ని సాధించే దిశగా అణ్వస్త్రాల అభివృద్ధి కీలక అడుగు అని మన దేశం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. 

1971 డిసెంబరులో భారత్‌-పాక్‌ యుద్ధం జరుగుతున్న సమయంలో మన దేశాన్ని బెదిరించడానికి అమెరికా తన విమానవాహక నౌక యూఎస్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజ్‌ను బంగాళాఖాతంలోకి పంపింది. దీనికి స్పందనగా సోవియట్‌ యూనియన్‌.. అణు క్షిపణులు కలిగిన ఒక జలాంతర్గామిని మోహరించింది. దీంతో అమెరికా యుద్ధనౌక అక్కడి నుంచి వైదొలిగింది. ఈ పరిణామంతో అణ్వస్త్రాలు, బాలిస్టిక్‌ క్షిపణుల సత్తా గురించి నాటి ప్రధాని ఇందిరా గాంధీకి అవగతమైంది. 


భారత అణు ప్రస్థానం ఇలా.. 

1944లో హోమీ జహంగీర్‌ భాభా.. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌)ను ఏర్పాటు చేయడంతో భారత అణు కార్యక్రమానికి పునాదులు పడ్డాయి. స్వాతంత్య్రం వచ్చాక అణు పరిశోధనలకు నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ లాంఛనంగా అనుమతినిచ్చారు. శాంతియుత కార్యక్రమాలకే వాటిని పరిమితం చేయాలన్నారు. 

  • భాభా నేతృత్వంలో క్రమంగా అణ్వాయుధ రూపకల్పన వైపు అడుగులు పడ్డాయి. 1954 నుంచి 1959 మధ్య ఈ పరిశోధన ఊపందుకుంది. 
  • భాభా మరణం తర్వాత అణ్వస్త్ర పరిశోధన కార్యక్రమాన్ని భౌతికశాస్త్రవేత్త రాజా రామన్న పర్యవేక్షించారు. 
  • లాల్‌ బహుదూర్‌ శాస్త్రి ప్రధాని అయ్యాక.. భౌతిక శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ను అణు కార్యక్రమానికి అధిపతిగా నియమించారు. అయితే గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడ్డ శాస్త్రి.. ఈ ప్రాజెక్టును శాంతియుత అవసరాలకే పరిమితం చేశారు.  
  • 1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అణు కార్యక్రమంలో జోరు పెరిగింది.  
  • అణు సాధనాన్ని రూపొందించి, పరీక్షకు సిద్ధం చేయడానికి భాభా అణు పరిశోధన కేంద్రాని(బార్క్‌)కి 1972 సెప్టెంబరు 7న ఇందిరా గాంధీ అనుమతిచ్చారు. 

అమలు ఇలా.. 

అణు పరీక్షకు ప్రభుత్వం పచ్చజెండా ఊపాక దాన్ని సాకారం చేయడానికి రెండేళ్లపాటు పరిశోధకులు కసరత్తు చేశారు. 

పరీక్ష సాధనం: ఇది అణు విచ్ఛిత్తి సాధనం. దీని సామర్థ్యం 12-13 కిలోటన్నులు. జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబు సామర్థ్యం దాదాపు 15 కిలోటన్నులు. 

పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు: ‘బార్క్‌’ డైరెక్టర్‌ హోదాలో రాజా రామన్న నేతృత్వంలో పి.కె.అయ్యంగార్, రాజగోపాల చిదంబరం తదితరులతో కూడిన 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందం ఈ బాంబు రూపకల్పన, పరీక్షలో పాలుపంచుకుంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం కూడా అందులో ఉన్నారు. అణు బాంబుకు మీటను ప్రణబ్‌ దస్తిదార్‌ రూపొందించారు. 

  • ఈ అణు బాంబులో వాడిన ఆయుధ గ్రేడ్‌ ప్లుటోనియం అభివృద్ధిలో.. రసాయన ఇంజినీరు హోమీ సెథ్నా కీలక పాత్ర పోషించారు. 
  • రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో ఉన్న పోఖ్రాన్‌ అనే మారుమూల ప్రదేశాన్ని ఈ పరీక్ష కోసం ఎంచుకున్నారు. 
  • 1974 మే 18న ఉదయం 8.05 గంటలకు అణు పరీక్ష జరిగింది. ప్రణబ్‌ దస్తిదార్‌ మీట నొక్కి ఈ విస్ఫోటాన్ని నిర్వహించారు. పరీక్ష దిగ్విజయంగా సాగింది. వాతావరణంలో ఎలాంటి రేడియోధార్మికత కనిపించలేదు. 
  • పరీక్ష విజయవంతమైన విషయాన్ని ‘బుద్ధుడు ఎట్టకేలకు నవ్వాడు’ అనే సంకేతనామం ద్వారా ఫోన్లో ఇందిరకు రాజా రామన్న తెలియజేశారు.  
  • ప్రపంచాన్ని అణ్వస్త్రసహిత, రహిత దేశాలుగా విభజించిన అణు వ్యాప్తి నిరోధక చట్టం (ఎన్‌పీటీ) ఖరారైన ఆరేళ్ల తర్వాత మన దేశం ఈ పరీక్ష నిర్వహించింది. 

ఆపరేషన్‌ స్మైలింగ్‌ బుద్ధా 

ఈ అణు పరీక్షకు ‘ఆపరేషన్‌ స్మైలింగ్‌ బుద్ధా’ అని పేరు పెట్టారు. బుద్ధ జయంతి కూడా అదే రోజు కావడంతో ఈ పేరు ఖరారు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్‌-1గా నామకరణం చేసింది. ప్రపంచ దేశాల్లో ఆగ్రహావేశాలను చల్లార్చడానికి ఈ పరీక్షను ‘శాంతియుత అణు విస్ఫోటం’గా ఇందిర అభివర్ణించారు. 


అంతర్జాతీయ స్పందన 

దాదాపుగా అన్ని దేశాలూ భారత అణుపరీక్షను ఖండించాయి. కెనడా భారీగా ఆంక్షలు విధించింది. భారత్‌కు అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ఆంక్షలూ విధించింది. మన అణు పరీక్షలకు స్పందనగా అణు సరఫరాదారుల కూటమి (ఎన్‌ఎస్‌జీ) ఏర్పాటైంది. అణు సంబంధిత పదార్థాలు, యంత్రాల ఎగుమతులను నియంత్రించడం దీని ఉద్దేశం. 


పోఖ్రాన్‌లోనే ఎందుకు?

  • అణుపరీక్ష పూర్తయ్యేవరకూ ఈ ప్రాజెక్టును గోప్యంగా ఉంచాలని ఇందిర ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష కోసం చేస్తున్న ఏర్పాట్లు విదేశీ గూఢచారులు, నిఘా ఉపగ్రహాల కంటపడకుండా జాగ్రత్త వహించింది. ఈ కోణంలో పోఖ్రాన్‌ను అనువైన ప్రాంతంగా గుర్తించింది. అక్కడి భౌగోళిక, వాతావరణ అంశాలు ఇందుకు చక్కగా ఉపయోగపడ్డాయి. 
  • ఉద్దేశపూర్వకంగా మే నెలలో ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ నెలలో పోఖ్రాన్‌లో తీవ్ర గాలుల కారణంగా పెను ఇసుక తుపాన్లు ఏర్పడుతుంటాయి. ఇవి అమెరికా నిఘా ఉపగ్రహాల వీక్షణకు ఆటంకం కలిగిస్తాయి. 
  • ఆ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అణ్వస్త్ర పరీక్షకు జరిగే సన్నాహాలను ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లు కూడా పసిగట్టలేవు. 
  • 1998లో పోఖ్రాన్‌-2 పేరిట భారత్‌ ఇదే ప్రాంతంలో ఐదు అణు పరీక్షలు నిర్వహించింది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని