US-India: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్య ‘కుట్ర’ భగ్నం.. భారత్‌కు వెల్లడించిన అమెరికా..!

US-India: ఖలిస్థానీ నేత గురుపత్వంత్‌ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో కుట్ర జరిగినట్లు వస్తున్న వార్తలు దుమారం రేపాయి. దీనిపై భారత్‌ స్పందించింది. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

Updated : 23 Nov 2023 10:27 IST

దిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు అమెరికా (USA)లో కుట్ర జరిగిందంటూ పశ్చిమ దేశాల పత్రికలు కథనాలు వెలువరించాయి. ఆ కుట్రను తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం వెల్లడించినట్లు వాటిల్లో తెలిపాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత (India) ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే భారత విదేశాంగశాఖ దీనిపై పరోక్షంగా స్పందించింది. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అసలేం జరిగిందంటే..

తమ గడ్డపై గురుపత్వంత్‌ సింగ్ పన్నూను చంపేందుకు చేసిన ప్రయత్నాలను తాము భగ్నం చేశామని అమెరికా వెల్లడించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. ‘‘ఈ అంశాన్ని మేం తీవ్రంగా పరిగణించాం. అంతేకాదు.. భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల వద్ద దీనిని ప్రస్తావించాం. ఈ విషయం వినగానే భారత అధికారులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై న్యూదిల్లీ తదుపరి దర్యాప్తు చేస్తుందని మాకు అర్థమైంది. రాబోయే రోజుల్లో దీని గురించి మరింత సమాచారం బయటకు వస్తుంది. ఈ కుట్రకు బాధ్యులైన వారికి శిక్ష పడాలని మేం భావిస్తున్నాం’’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రీన్‌ వాట్సన్‌ చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.

ఆలస్యం కానున్న బందీల విడుదల.. కాల్పుల విరమణ!

ప్రస్తుతం ఈ ఘటనపై అమెరికా ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నట్లు అగ్రరాజ్య అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ కుట్ర గురించి అమెరికాకు ఎలా తెలిసింది? కుట్రను ఎలా భగ్నం చేశారన్న వివరాలను మాత్రం సదరు వర్గాలు బయటపెట్టలేదు. మరోవైపు దీనిపై స్పందించేందుకు అమెరికా ఎఫ్‌బీఐ, న్యాయశాఖ నిరాకరించింది.

అది ఆందోళనకరం: భారత్‌

ఈ కథనాలపై అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి స్పందించారు. ‘‘భారత్‌-అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య బంధాలు, తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారమిచ్చారు. ఆ సమాచార తీవ్రతను భారత్‌ గుర్తించింది. అది రెండు దేశాల భద్రతా ప్రయోజనాలకు ఆందోళనకరం. అమెరికా పంచుకున్న ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయి’’ అని బాగ్చి వెల్లడించారు.

సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను భారత్‌ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్‌ సింగ్ పన్నూ కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో ఉంటున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని