న్యూ ఇయర్‌లో కిమ్‌ చర్య: ఇది చాలా అరుదు..

నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియాలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

Published : 01 Jan 2021 14:35 IST

రెండున్నర కోట్ల ప్రజలకు లేఖలు

సియోల్‌: నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియాలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశ నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కరోనా కష్ట కాలంలో తనను నమ్మి, సహకరిస్తున్నందుకు దేశ ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

‘‘మన దేశ ప్రజల ఆశయాలు, కోరికలు నిజరూపం దాల్చేందుకు,  కొత్త శకాన్ని ఆరంభించేందుకు నేను ఈ నూతన సంవత్సరంలో కూడా మరింత కృషి చేస్తాను. క్లిష్ట సమయాల్లో కూడా నాపై తిరుగులేని నమ్మకం ఉంచి, మా పార్టీ వెంట నిలిచిన ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అంటూ కిమ్‌ కొత్త సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు. ఈ సందేశంతో కూడిన రెండున్నర కోట్ల లేఖలను ప్రజలకు అందించామని అక్కడి అధికారులు తెలిపారు. సాధారణంగా నూతన సంవత్సరం తొలి రోజు ఈ కొరియా నేత టీవీలో ప్రసంగిస్తారు. ఐతే ఈసారి ఆ సంప్రదాయానికి  విరుద్ధంగా తన సందేశాన్ని బహిరంగ లేఖల రూపంలో విడుదల చేయటం గమనార్హం. ఓ ఉత్తర కొరియా నేత ఈ విధంగా సందేశాలను విడుదల చేయటం 1995 తర్వాత ఇదే తొలిసారి.

తమ దేశంలో కరోనా కేసులే లేవని ఉత్తర కొరియా చెబుతున్నప్పటికీ.. అది అసాధ్యమని దక్షణ కొరియా, అమెరికా అంటున్నాయి.  అయితే  దేశ సరిహద్దుల మూసివేత తదితర కఠిన చర్యల ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. కొత్త సంవత్సరం సందర్భంగా కిమ్‌.. కుంసుసాన్‌ ప్యాలస్‌లో ఉండే ఉత్తర కొరియా గత పాలకులైన తన తాత, తండ్రుల స్మారక చిహ్నాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

విందామా.. మోదీ కవిత!

పోతూ పోతూ.. ట్రంపరితనం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని