రీఎంట్రీ ఇవ్వడం లేదు‌: సమీరా రెడ్డి

బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో తెరకెక్కిన పలు చిత్రాల్లో కథానాయికగా నటించి కొన్నేళ్లపాటు ప్రేక్షకులను అలరించారు నటి సమీరా రెడ్డి. వివాహమానంతరం వెండితెరకు దూరమైన ఆమె ప్రస్తుతం తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఈ మేరకు తరచూ తన చిన్నారులతో కలిసి సరదా వీడియోలు...

Published : 30 Oct 2020 09:39 IST

చెన్నై: బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో నటించి కొన్నేళ్లపాటు ప్రేక్షకులను అలరించారు నటి సమీరా రెడ్డి. పెళ్లి అనంతరం వెండితెరకు దూరమైన ఆమె ప్రస్తుతం తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. తరచూ తన చిన్నారులతో కలిసి సరదా వీడియోలు చిత్రీకరించి సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమీరారెడ్డి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆర్య, విశాల్‌ ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్న ఓ కోలీవుడ్‌ చిత్రంలో సమీరా రెడ్డి నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా, తాజాగా సదరు వార్తలపై నటి స్పందించారు. అవన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారని వివరించారు.

‘మైనే దిల్‌ తుజ్కో దియా’ అనే బాలీవుడ్‌ చిత్రంతో సమీరారెడ్డి కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘నరసింహుడు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆమె అనంతరం ‘జై చిరంజీవా’, ‘అశోక్‌’ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ‘కృష్ణం వందే జగద్గురుం’లోని ఓ ప్రత్యేక పాటలో ఆమె చివరిగా తెలుగు తెరపై ఆడిపాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని