మాహిష్మతిలో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిందే!

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క కీలక పాత్రలో నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘బాహుబలి’. రెండు  భాగాలుగా విడుదలైన

Published : 27 Jun 2020 02:12 IST

వీడియో వైరల్‌

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క కీలక పాత్రల్లో నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.1000కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మాహిష్మతి సామ్రాజ్యం, యాక్షన్‌ సన్నివేశాలు ఇలా ‘బాహుబలి’ని రాజమౌళి ఓ విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దారు.

కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మాస్క్‌ ఆవశ్యకతను తెలియజేసేలా, ‘బాహుబలి2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌, రానాలు మాస్క్‌లు ధరించి పోరాడుతున్నట్లు రూపొందించిన వీడియోను రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. ఒక వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో టీమ్‌ తయారు చేసిన ఈ వీడియోను షేర్‌ చేస్తూ, వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ భద్రంగా ఈ విధంగా నిబంధనలు పాటిస్తారని భావిస్తున్నా’ అని జక్కన్న పేర్కొన్నారు. ‘మాహిష్మతిలో ఉన్నా ప్రస్తుతం మాస్క్‌ తప్పనిసరి మర్చిపోవద్దు’ అని వీడియోలో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా ఆకట్టుకుంటోంది.

మరోవైపు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడటంతో తిరిగి షెడ్యూల్‌ను ఎలా ప్రారంభించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని