Naga vamsi: మేమింకా నిర్ణయం తీసుకోలేదు.. విశ్వక్‌సేన్‌ పోస్ట్‌పై స్పందించిన నాగవంశీ

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిత్ర నిర్మాత నాగవంశీ. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన విశ్వక్‌సేన్‌ సినిమా గురించి మాట్లాడారు.

Updated : 03 Nov 2023 14:53 IST

హైదరాబాద్‌: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) రిలీజ్‌ను ఉద్దేశించి ఇటీవల విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) పెట్టిన పోస్ట్‌పై చిత్ర నిర్మాత నాగ వంశీ తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో స్పందించారు. సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ముందు అనుకున్న సమయానికే విడుదల చేయాలా? లేదా వాయిదా వేయాలా? అనే విషయంపై తామింకా ఏమీ ఆలోచించలేదన్నారు.

‘‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ వాయిదా వేయొద్దంటూ ఇటీవల విశ్వక్‌సేన్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 8న విడుదల చేయాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అదే తేదీన వరుణ్‌ తేజ్‌ నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కూడా విడుదల కానుంది. అనుకోకుండా ‘సలార్‌’ డిసెంబర్‌కు వాయిదా పడటంతో ‘హాయ్‌ నాన్న’ ‘ఎక్స్‌ట్రా’ సైతం ఆ వారంలోనే రిలీజ్‌ కానున్నాయి. నాని, నితిన్‌తో మా బ్యానర్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి, నాలుగు చిత్రాలు ఒకేసారి విడుదలైతే పోటీ ఉంటుందని భావించి.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పోస్ట్ పోన్ చేద్దామని నేను అంటానేమోనని విశ్వక్‌ భావించి ఉంటాడు. అనుకున్న తేదీ కాకుండా సినిమా విడుదల వాయిదా వేస్తే ఏ హీరో అయినా ఎంతగానో బాధపడతారు. అందుకే, విశ్వక్‌ అలా పోస్ట్‌ పెట్టాడనుకుంటా. అనుకున్న తేదీకే రిలీజ్‌ చేయాలా? లేదా వాయిదా వేయాలా? అనేది మేమింకా ఆలోచించలేదు. షూటింగ్‌ జరుగుతోంది. సినిమా చూసి.. మేకింగ్‌ పట్ల నేనూ-విశ్వక్‌ కాన్ఫిడెంట్‌గా ఉంటే డిసెంబర్‌ 8నే రిలీజ్‌ చేస్తాం’’ అని నాగవంశీ చెప్పారు. ఇక, ఈ నెల మొదటి వారంలోనే ‘గుంటూరు కారం’ ఫస్ట్‌సాంగ్‌ విడుదల చేస్తామని చెప్పారు. ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే పాటలో తరచూ కరెక్షన్స్‌ చేస్తున్నామని తెలిపారు.

పెళ్లి విషయంలో ఒత్తిడికి గురవుతున్నా..: శ్రుతి హాసన్‌

‘దాస్‌ కా ధమ్కీ’ తర్వాత విశ్వక్‌ సేన్‌ నటిస్తోన్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకుడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌, వినోదం నిండిన కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నేహాశెట్టి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. డిసెంబర్‌ 8న దీనిని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ను ఉద్దేశించి.. ‘‘బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అనుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రతి ఫ్రేమ్‌లో ప్రాణం పెట్టి పనిచేసి చెప్తున్నా. డిసెంబర్‌ 8న వస్తున్నాం. హిట్‌, ఫ్లాప్‌, సూపర్‌హిట్‌, అట్టర్‌ ఫ్లాప్‌ అనేది మీ నిర్ణయం. ఆవేశంతోనో లేదా అహంకారంతోనో తీసుకున్న నిర్ణయం కాదిది. తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని అర్థమైంది. డిసెంబర్‌ 8 సివాలెత్తిపోద్ది. గంగమ్మతల్లిపై నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్‌లో కనుక మా సినిమా విడుదల కాకపోతే ఇకపై నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడరు’’ అంటూ ఇటీవల విశ్వక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అంటా వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని