Pawan Kalyan: చిరంజీవికి అభినందనలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌

ప్రముఖ నటుడు చిరంజీవికి ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది అవార్డు రావడం పట్ల ఆయన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేసి అభినందనలు తెలిపారు. 

Published : 21 Nov 2022 02:36 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు చిరంజీవికి ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రావడం పట్ల ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవిని ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరోక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాలకుపైగా సాగుతున్న అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవికి ఈ గౌరవం దక్కుతుందన్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

మరోవైపు తనకు అవార్డు ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమతోనే  ఈ స్థాయికి చేరుకున్నట్లు ట్వీట్‌ చేశారు. సినీ పరిశ్రమకు చిరంజీవి అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గోవాలో ఆదివారం జరిగిన ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించింది. దీంతో పలువురు ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని