Tollywood: తొలి అడుగు.. టాలీవుడ్‌లో విజయంతో ముందడుగు

Tollywood: మొదటి ప్రయత్నంలోనే సక్సెస్‌ఫుల్‌ అయిన యువ దర్శకుల ఎవరో చూద్దామా!

Updated : 31 Aug 2021 12:14 IST

దర్శకులకు తొలి చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ సినిమా ఫలితం మీదే కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. కెరీర్‌గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరగాలన్నా, అధఃపాతాళానికి పడిపోవాలన్నా తొలి చిత్రమే కీలకం. ఓ రకంగా మొదటి సినిమా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశ పరీక్షలాంటిదే. ఈ ఏడాది కొందరు యువ దర్శకులు ఆ తొలిపరీక్షలో నెగ్గి విజయవంతంగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశారు. వారిలో కొందరు థియేటర్‌లో సూపర్‌ డూపర్‌ హిట్లు కొడితే, మరికొంత మంది నేరుగా ఓటీటీల ద్వారా హిట్లు సాధించారు. అలా ఈ ఏడాది మొదటి ప్రయత్నంలోనే సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌ అయినవారెవరో ఓ సారి చూద్దాం..

బుచ్చిబాబు వసూళ్ల ‘ఉప్పెన’

తెలుగులో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని, అరంగేట్రంలోనే అందరిచూపుని తనవైపు తిప్పుకొన్నాడు బుచ్చిబాబు. సుకుమార్‌ శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఉప్పెన’తో తనదైన మార్క్ చూపించాడు. హీరోహీరోయిన్లకు కూడా ఇదే తొలిచిత్రం కావడం విశేషం.  వైష్ణవ్ తేజ్‌‌, కృతిశెట్టిల జోడీ అందరినీ ఆకట్టుకుంది. సముద్రతీర ప్రేమకథగా వచ్చి బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించింది. దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమా విజయంలోనూ తోడ్పడింది. కథకు తగినట్లుగా బుచ్చిబాబు నటీనటులను ఎంచుకోవడమే కాకుండా, వారి నుంచి  కావాల్సిన నటనను రాబట్టుకున్నాడు. దర్శకుడిలోని ఆ ప్రతిభే ‘ఉప్పెన’ చిత్రానికి ఘనవిజయాన్ని సాధించి పెట్టింది. తన తదుపరి చిత్రాన్ని ఓ అగ్రహీరోతో చేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

 వైవిధ్యానికి ‘నాంది’.. విజయ్‌ కనకమేడల

వరుస పరాజయాలతో సతమతమవుతున్న నరేశ్‌కు పునర్జన్మలాంటి ‘నాంది’. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన విజయ్‌ కనకమేడల నరేశ్‌ను విభిన్నంగా చూపించి విజయానికి నాంది పలికాడు. చేయని నేరానికి జైలు శిక్షపడిన ఓ ఖైదీ ఏం చేశాడనే కథాంశంతో తెరకెక్కింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. హాస్యచిత్రాల కథానాయకుడిగా నరేశ్‌పై ఉన్న ముద్రను నాందితో చెరిపేశాడీ దర్శకుడు. థియేటర్‌ కలెక్షన్లతో పాటు ఓటీటీ, శాటిలైట్ హక్కులతో ‘నాంది’ లాభాలు ఆర్జించింది. 

కలెక్షన్ల చోరుడు.. హసిత్‌ గోలి

కరోనా సెకండ్‌వేవ్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న సినిమా ‘రాజ రాజ చోర’.  క్రైమ్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంతో మరో విజయాన్ని  ఖాతాలో వేసుకున్నాడు హీరో శ్రీ విష్ణు. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్ రావడంతో మంచి కలెక్షన్లు  రాబడుతోంది. డిజిటల్‌ హక్కులు కూడా భారీ రేటుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని సమాచారం. మేఘా ఆకాశ్‌, సునైనాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు దొంగగా నటించాడు. కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగా పండటంతో ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు. సెకండ్‌ వేవ్‌ తర్వాత తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయం సాధించాడు హసిత్‌ గోలి.


మినీ కథతో మెగా విజయం.. కార్తీక్‌ రాపోలు

వైవిధ్యభరిత చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం తెలిసిందే. ‘ఏక్‌ మినీ కథ’ కూడా వైవిధ్యంగా సాగే ఓ అడల్ట్‌ కామెడీ డ్రామా. థియేటర్లలో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలయ్యింది. ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో విజయం సాధించాడు దర్శకుడు కార్తీక్ రాపోలు.  మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సాధించాడీ దర్శకడు. ‘ఏక్‌ మినీ కథ’కు  మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. కుర్ర హీరో శోభన్‌ ఈ సినిమాతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.  రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాను రూ. 9 కోట్లకు అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకోవడం విశేషం.


విజయానికి ‘శ్రీకారం’

తన మొదటి చిత్రం ‘శ్రీకారం’తో మంచి దర్శకుడిగా నిరూపించుకున్నాడు కిషోర్‌రెడ్డి. బాక్సాఫీస్‌ వద్ద ఓకే అనిపించిన ఈ సినిమాకు ఓటీటీ, శాటిలైట్‌ హక్కులతో కమర్షియల్‌గా పడిపోకుండా నిలబడింది. డిజిటల్‌ వేదికపై విడుదలైన ఈ చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. గ్రామీణ వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని సంభాషణలు, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శర్వానంద్‌, ప్రియాంక మోహన్‌ హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో హీరో శర్వా నటనకు మంచి మార్కులు పడ్డాయి. 


సినిమా బండి..  ప్రవీణ్‌ కాండ్రేగుల

‘ఫ్యామిలీ మ్యాన్‌’ దర్శక ద్వయం రాజ్‌ డీకే తెలుగులో నిర్మించిన చిత్రం ‘సినిమా బండి’. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఓ మారుమూల గ్రామంలోని ఆటో డ్రైవర్‌ తనకు దొరికిన కెమెరాతో సినిమా తీసేందుకు పడిన పాట్లు కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమాలో వినిపించే యాస సినిమాకు ప్రత్యేకతను చేకూర్చింది. రెగ్యులర్‌ సినిమాల్లోని తెలుగుకు విభిన్నంగా అనంతపురం యాస విపరీతంగా ఆకట్టుకుంది. పల్లెటూరి అమాయకత్వం, సినిమా తీసే ప్రయత్నంలో పండిన కామెడీ నవ్వులు పూయించింది. అలా తొలి అడుగులోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్‌ కాండ్రేగుల.


వీరి ప్రయత్నాలూ మెప్పించాయి

కమర్షియల్‌ సక్సెస్‌ సాధించకున్నా.. తొలి చిత్రంతో చేసిన కొందరి ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. విభిన్న కథాంశంతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకున్నారు కొందరు దర్శకులు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మెయిల్‌’ మంచి సినిమాగా నిలిచింది. కంబాలపల్లి కథలు సిరీస్‌లో వచ్చిన మొదటి భాగమిది. ‘ఆహా’లో విడుదలైన ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించాడు.  తెలంగాణ గ్రామాల్లోకి కంప్యూటర్‌ వచ్చిన కాలంలో ఈ కథ సాగుతుంది. తెలంగాణ గ్రామాల్లోని ప్రజల అమాయకత్వం, అక్కడి మట్టి పరిమళాన్ని అందంగా చూపించాడు యువ దర్శకుడు ఉదయ్‌ గుర్రాల. అలాగే ‘ప్లే బ్యాక్‌’ చిత్రంతో హరి ప్రసాద్‌ జక్కా చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లో ఆశించిన వసూళ్లు రాబట్టుకోలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీల్లోకి వచ్చాక జనాదరణ పొందింది. వితంతువుతో హీరో ప్రేమలో పడే కథాంశంతో ‘చావు కబురు చల్లగా’ తెరకెక్కింది. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కినా  కథకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోవడంతో బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. కానీ దర్శకుడు కౌషిక్‌ పెగల్లపాటి మొదటి సినిమాతోనే చేసిన ఈ ప్రయత్నానికి ప్రశంసలు దక్కాయి. ఇలా కొంతమంది బాక్సాఫీసు వద్ద  సూపర్‌హిట్లు కొడితే, మరికొంత మంది తమ ప్రయత్నాలతో అలరించే ప్రయత్నం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు