tuck jagadish: అందుకే ‘టక్‌ జగదీష్‌’ ఓటీటీలో విడుదల చేస్తున్నాం!

tuck jagadish: నాని కథానాయకుడిగా నటించిన ‘టక్‌ జగదీష్‌’ఓటీటీలో విడుదలవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాత సాహు గారపాటి విలేకరులతో మాట్లాడారు.

Published : 04 Sep 2021 19:45 IST

హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల వల్లే ‘టక్‌ జగదీష్‌’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత సాహు గారపాటి తెలిపారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి మీడియాతో మాట్లాడారు.

భావోద్వేగాలకు పెద్ద పీట

‘‘మజిలీ’ తర్వాత ఈ సినిమా మొదలు పెట్టాం. అందులో భార్యాభర్తల మధ్య ఉండే  ఎమోషన్స్ తీశాం. అలాంటి ఎమోషన్స్‌ కూడిన కథతో మరో సినిమా చేద్దామని శివ నిర్వాణను అడిగితే ‘టక్‌ జగదీష్‌’ చెప్పారు. ఈ కథను నానికి చెప్పడంతో ఆయనకు నచ్చి వెంటనే ఒప్పుకొన్నారు.  ఇప్పటి వరకు ఆయన పోషించని పాత్ర ఇది. ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా ‘టక్ జగదీష్’ ఉంటుంది. సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు. ద్వితీయార్ధం మొత్తం భావోద్వేగాలతో నడుస్తుంది’’

మా ప్రాధాన్యం థియేటర్లే

‘‘ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని అనుకున్నాం. ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాం. కరోనాతో మా ఆశలు అడియాసలు అయ్యాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలు అందరిలోనూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాలకు వరకు తీసుకొస్తామా? లేదా? ఇంకెప్పుడు చూపిస్తామని అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాలు చూడడానికి వేరే కొత్త మీడియమ్స్ వచ్చాయి. థియేటర్లు కూడా ఉంటాయి. మా ప్రయార్టీ ఎప్పుడూ కూడా థియేటర్లే. మా సమస్యలు మాకు ఉన్నాయి.. ఇండస్ట్రీ నుంచి కూడా మాకు సపోర్ట్ వచ్చింది. గిల్డ్ నుంచి కూడా మద్దతు లభించింది. అందుకే మేం ఎక్కువగా మాట్లాడలేదు. హీరోలైనా, నిర్మాతలైనా ఎవ్వరైనా సరే.. సినిమాను జనాలకు చూపించాలనే అనుకుంటారు. ఇది జనాలకు పండుగ నాడు చూపించాల్సిన సినిమా’’

అందుకే ఓటీటీ నిర్ణయం

‘‘ఇది భారీ బడ్జెట్ చిత్రం. ఈ లెక్కన అన్ని చోట్లా థియేటర్లు తెరిచి ఉండాలి. కానీ పరిస్థితులు అలా లేనందుకే ఓటీటీకి వెళ్లాం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఫలితం వల్ల మా అభిప్రాయం మారలేదు. ఆగస్టులో మేం థియేటర్‌కు రావాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నట్టు మాకు కనిపించలేదు. అందుకే ఓటీటీ నిర్ణయాన్ని తీసుకున్నాం. రెండు మూడు నెలల్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఉంది’’

తర్వాతి ప్రాజెక్టులు ఇవే!

‘‘అనిల్ రావిపూడి బాలయ్య ప్రాజెక్ట్‌ను దసరాకు ప్రకటిస్తాం. నాగ చైతన్యతో కూడా ఓ సినిమా ఉంది. విజయ్ దేవరకొండ బిజీగా ఉండటంతో సినిమా కుదరడం లేదు ఇంకా కొంచెం సమయం పడుతుంది’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని