Harish Rao: భారాస నేతలను టార్గెట్‌ చేస్తున్నారు: మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే పనిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టుకుందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 15 Mar 2024 12:57 IST

పటాన్‌చెరు: ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే పనిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టుకుందని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీలో చేరకుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పటాన్‌చెరు మండలం లక్డారంలో మైనింగ్‌కు అనుమతులు ముగిసినా పనులు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసింది. అక్రమ కేసులు పెట్టి మా ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తోంది. వందల మంది పోలీసులు వెళ్లి వేకువజామున 3 గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారు?అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఏదో ఒకవిధంగా జైలుకు పంపాలని చూస్తున్నారు. బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు అక్కడ క్రషర్లు ఉన్నాయి. వాటికి అనుమతులు లేకపోయినా నడుస్తున్నాయి. భారాస నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో మేం దాడులు చేస్తున్నామని స్వయంగా ఆర్డీవో చెప్పారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు శిక్ష వేస్తాం’’ అని హరీశ్‌రావు అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని