Chandra Babu: తెదేపా-జనసేన పొత్తు చారిత్రక అవసరం: చంద్రబాబు

ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైకాపా ఓటమి ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన  ‘యువగళం-నవశకం’ సభ ద్వారా తెదేపా-జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి.

Updated : 20 Dec 2023 22:25 IST

నెల్లిమర్ల: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైకాపా ఓటమి ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన  ‘యువగళం-నవశకం’ సభ ద్వారా తెదేపా-జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. పొత్తుపై ఇరు పార్టీల అధినేతలు ఈ వేదికపై నుంచి రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చారు. పవన్‌, బాలకృష్ణ సభకు హాజరై కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు రాష్ట్ర నలుమూలల నుంచి తెదేపా, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘భారత దేశంలో పాదయాత్రలు చేయడం కొత్తకాదు. నేను కూడా పాదయాత్ర, బస్సు యాత్ర చేశా. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మొదటిసారి ఎన్టీఆర్‌ గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పాదయాత్రలు చూశా. కానీ, ఎప్పుడూ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవు. మొదటి సారిగా సైకో జగన్‌ పాలనలోనే ఇలాంటి ఘటనలు చూశాం. ఒక పవిత్రమైన భావనతో పాదయాత్ర చేస్తున్నప్పుడు చేతనైతే సహకరించాలి.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి. కానీ, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. యువగళం వాలంటీర్లను జైలుకు పంపారు. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. యువగళం.. ప్రజాగర్జనకు నాంది పలికింది. ప్రజల్లో ఉండే బాధ, ఆక్రోశం, ఆగ్రహం యువగళంలో చూపించారు.

వైకాపా నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది..

వైకాపా నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. మెడపై కత్తి బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఒకప్పుడు విశాఖ ఆర్థిక రాజధాని.. ఇప్పుడు గంజాయి రాజధానిగా మారింది. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగింది.. కబ్జాలు పెరిగాయి. మంచి చేస్తే ఆ ఫలితాలు అందరికీ వస్తాయి. చెడు చేస్తే దాని వల్ల అందరికీ నష్టం వస్తుంది. అదే ఈరోజు జగన్‌రెడ్డి చేసే పని. ఒక్కఛాన్స్‌ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. విధ్వంస పాలనకు జగన్‌ నాంది పలికారు. వైకాపా పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయి. రుషికొండను బోడిగుండు చేసి.. సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారు? అమరావతిని సర్వనాశనం చేసి మూడుముక్కలాట ఆడారు. తెదేపా అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లం. అబద్ధాల పునాదులపై నిర్మించిన పార్టీ వైకాపా. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారాలి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి.. తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించాం. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటా. అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేస్తాం. అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటాం. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తాం. భవిష్యత్‌లో ఏయే కార్యక్రమాలు చేయాలనేదానిపై అధ్యయనం చేస్తాం. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైకాపా ఓడిపోవడం ఖాయం. తెదేపా-జనసేన పొత్తు ప్రకటించినప్పుడే వైకాపా పని అయిపోయింది. తెదేపా-జనసేన పొత్తు చారిత్రక అవసరం.

మహిళలకు రక్షణ ఉండాలంటే ఏపీ.. వైకాపా విముక్త రాష్ట్రంగా మారాలి. వైకాపా ఒక రాజకీయ పార్టీకాదు. జగన్‌ రాజకీయాలకు అనర్హుడు. ఒక్క ఓటు ఆ పార్టీకి వేసినా..అది శాపంగా మారుతుంది. జగన్‌ చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. తెదేపా, జనసేనకు ఓటు వేస్తారనుకుంటే వారి పేర్లు జాబితా నుంచి తొలగిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని సంఘటలు ఏపీలో జరగుతున్నాయి. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మీరు ఒక త్యాగం చేస్తే.. మేం వంద త్యాగాలు చేసి రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తాం. అభివృద్ధి చేయడానికి ముందుకొస్తాం. ఉద్యోగులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని