Russia: భారత లోక్‌సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు

భారత వ్యక్తుల ప్రమేయంతో తమ గడ్డపై గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపించిన వేళ.. మన దేశానికి రష్యా(Russia) అండగా నిలిచింది. అంతేగాక, భారత ఎన్నికల్లో అగ్రరాజ్యం జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని మాస్కో దుయ్యబట్టింది.

Updated : 09 May 2024 11:55 IST

మాస్కో: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు తమ దేశంలో కుట్ర జరిగిందంటూ, దానివెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా (USA) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను తాజాగా రష్యా(Russia) తోసిపుచ్చింది. వాటికి ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదని తెలిపింది. ఇక, భారత సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. 

‘‘భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలన్న ఉద్దేశంతో.. అక్కడి అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపర్చాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది’’ అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా మారియా వ్యాఖ్యానించారు. మత స్వేచ్ఛ విషయంలో భారత్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.

ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్‌ వే ఫంగ్హా

‘‘ఇది మా దేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే. ‘యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌’ అనేది పక్షపాతంతో వ్యవహరించే సంస్థ. రాజకీయ ఎజెండాతోనే అది పని చేస్తుంది. భారత్‌లోని విభిన్న, బహుళార్థ, ప్రజాస్వామ్య విలువలు ఆ సంస్థకు అర్థం కావు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియలో ఇలా అమెరికా సంస్థ జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు’’ అని న్యూదిల్లీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మీడియా అడిగిన ప్రశ్నకు మారియా పైవిధంగా స్పందించారు.

పన్నూ కేసులో సాక్ష్యాల్లేవ్‌..

ఈ సందర్భంగా పన్నూ హత్యకు కుట్ర కేసు గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇప్పటివరకు మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించి వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకు అందించలేదు. తగిన ఆధారాలు లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు చేయడం ఆమోదయోగ్యం కాదు’’ అని మారియా బదులిచ్చారు.

అమెరికాలోని సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జె) సంస్థ ప్రతినిధి గురుపత్వంత్‌ సింగ్‌ ఖలిస్థానీల కీలక నేత. భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్‌ను భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు విస్మయం వ్యక్తం చేశారని కొద్దిరోజుల క్రితం వాషింగ్టన్ పోస్ట్‌ కథనం పేర్కొంది. అయితే, అమెరికా నిఘా విభాగాలు పన్నూపై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని తెలిపింది. అలాగే ఆ ‘రా’ అధికారి పేరు విక్రమ్ యాదవ్‌గా పేర్కొంది. భారత ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి ఈ ప్లాన్‌ తెలుసునని వ్యాఖ్యానించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ‘‘ఒక సున్నితమైన అంశంపై ఆ నివేదిక నిరాధారమైన, అనవసర ఆరోపణలు చేస్తోంది. దర్యాప్తు కొనసాగుతోన్న వేళ.. ఇలాంటి ఊహాజనితమైన, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చవు’’ అని మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని