chandrababu: మా జెండాలు వేరు కావచ్చు.. కానీ అజెండా ప్రజా సంక్షేమమే : చంద్రబాబు

ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.

Updated : 17 Mar 2024 22:34 IST

చిలకలూరిపేట: ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

‘‘ఐదు కోట్ల తెలుగు ప్రజల తరఫున ప్రగతివాది ప్రధాని మోదీకి స్వాగతం. రాష్ట్ర పునర్‌ నిర్మాణ సభ ఇది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఐదేళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మూడు పార్టీలు జట్టు కట్టాయి. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. మీరు  మమ్మల్ని ఆశీర్వదించాలి. మా జెండాలు వేరే కావచ్చు. మా అజెండా ఒక్కటే. సంక్షేమం. అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ.  ప్రజల కోసం తపించే పవన్‌కల్యాణ్‌కు అభినందనలు.  మోదీగారు ఒక వ్యక్తి కాదు. భారతదేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తి.  మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం.. ప్రపంచం మెచ్చిన మేటి నాయకుడు. ప్రధాన మంత్రి అన్నయోజన, ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జల్‌ జీవన్‌ మిషన్‌ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారు.

మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు..

పేదరికం లేకుండా చేయడం మోదీ కల. మనందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలి. వికసిత్‌ భారత్‌కు ఇదే సరైన సమయం. అందుకు మనమంతా అండగా ఉండాలి. ఇదే నా వాగ్దానం. భారత్‌ను నెంబర్‌వన్‌ దేశంగా మార్చే శక్తి ఆయనకు ఉంది. భారతీయులు శక్తిమంతమైన జాతిగా చేయడం ఆయన ఆశయం. దేశం దూసుకుపోతోంది. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత సవాళ్లు, సమస్యలను అధిగమించాం. ఎన్డీయేలో భాగస్వాములయ్యాం. అనేక కార్యక్రమాలు చేశాం. 11 జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పాం. అమరావతి నిర్మాణానికి పునాదులు వేశాం. అది పూర్తయి ఉంటే, దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా మారేది. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి  జగన్‌. పోలవరాన్ని గోదావరిలో కలిపారు. సహజ వనరులు దోచేశారు. జె బ్రాండ్‌తో కల్తీ లిక్కర్‌ తెచ్చి అనేకమంది ప్రజలను బలితీసుకున్నారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి..

పెట్టుబడులు తరిమేశారు. ఐదేళ్లలో రోడ్లు లేవు.. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధేలేదు. ప్రజలకు మనశ్శాంతి లేదు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్‌ చీకటిమయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించిన వారిని అణచివేశారు. జగన్ అధికార దాహానికి బాబాయ్‌ బలయ్యారు. ఇద్దరు చెల్లెళ్లు రోడెక్కి జగన్‌కు ఓటు వేయొద్దని చెబుతున్నారంటే.. ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి. మన బిడ్డలు వెలగాలి. అందుకే ఈ పొత్తు. దేశంలో ఎన్డీయే 400+ సీట్లు వస్తాయి. ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మీదే. రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాలి’’అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు