మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ రాజీనామా

సమర్థ వంతంగా ప్రజలకు పాలన అందించామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు.  శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

Published : 21 Mar 2020 01:01 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు. ‘‘15 నెలల పాటు రాష్ట్రాభివృద్దికోసం కష్టపడి పనిచేశాం. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. 2018 డిసెంబరులో మా ప్రభుత్వం ఏర్పడింది. మెజార్టీ స్థానాలు గెలుచుకుని మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ రైతులు మాపై ఎంతో విశ్వాసం ఉంచారు. వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాం, 20లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ప్రజల విశ్వాసానికి అనుకూలంగా పరిపాలించాలని భావించాం. కానీ, మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రజల నమ్మకాన్ని భాజపా వమ్ము చేసింది. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక కుట్రలు పన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పనిచేయడం భాజపాకు నచ్చలేదు’’ అని కమల్‌నాథ్‌ విమర్శించారు.

 మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం  బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మధ్యాహ్నం 2గంటలకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో కమల్‌నాథ్‌ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సింధియా వెంటే తాము ఉంటామన్నారు. వారిలో మొదట ఆరుగురి రాజీనామాల్ని స్పీకర్‌ ప్రజాపతి ఇప్పటికే ఆమోదించారు. కాగా బలపరీక్ష వెంటనే నిర్వహించాలంటూ భాజపా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు బల పరీక్ష నిర్వహించేందుకు శుక్రవారం 5గంటల వరకు డెడ్‌లైన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా గురువారం మరో 16 మంది రాజీనామాల్ని స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించారు.


అసెంబ్లీలో సంఖ్యా బలం ఇలా:

230 శాసనసభ స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 228 ఎమ్మెల్యేలుండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్‌ ఆమోదం పొందడంతో ఎమ్మెల్యేల సంఖ్య 206కు చేరింది. ప్రస్తుతం బలపరీక్షలో ఏ పార్టీ నెగ్గాలన్నా 104 మంది ఎమ్మెల్యేలు అవసరం. భాజపాకు 107 మంది సంఖ్యా బలం ఉంది. గతంలో 114 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్‌ 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో 92కు చేరింది. మరో ఏడు మంది ఇతర పార్టీల సభ్యులు ఉన్నారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని