తెలంగాణలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

ఇతర రాష్ట్రాల నాయకులకు డబ్బులిచ్చి, ప్రగతిభవన్‌కు రప్పించి, కేసీఆర్‌ భారాస కండువా కప్పుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.

Published : 30 Jan 2023 04:12 IST

రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో రాష్ట్రం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే : ఇతర రాష్ట్రాల నాయకులకు డబ్బులిచ్చి, ప్రగతిభవన్‌కు రప్పించి, కేసీఆర్‌ భారాస కండువా కప్పుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని విషయాన్ని కూడా భారాసలో చేరిన నేతలకు కేసీఆర్‌ చెప్పాలన్నారు. తెలంగాణను అభివృద్ధి చేశామని చెప్పుకొంటున్న కేసీఆర్‌ దీనిపై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌లో ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెెలంగాణలో 90 వేల మంది అన్నదాతలకు రైతు బీమా కట్టారని, అందులో 10 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో పేర్కొందన్నారు. అన్నదాత పండించిన ప్రతిగింజా కేంద్రమే కొంటుందని.. మోదీకి ఎక్కడ పేరు వస్తుందోననే భయంతో భారాస సర్కారే ధాన్యం కొంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. భారాస ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిందని, దీంతో ఒక్కో కుటుంబంపై సుమారు రూ.6 లక్షల భారం పడిందన్నారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని, అది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.కోట్ల బకాయిలను చెల్లించకుండా ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతోందన్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో రూ.వంద కోట్ల బకాయిలు రావాలని,  పన్నులు వసూలు చేయాలని కోరితే భాజపాను మతతత్వ పార్టీగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారన్నారు.కేటీఆర్‌ మాట్లాడిన ముందస్తు ఎన్నికలపై స్పందిస్తూ దీనిపై కేసీఆర్‌ మాట్లాడాలన్నారు. తాము ఏడాది క్రితమే భారాస ముందస్తు ఎన్నికలకు వెళ్తే తామూ సిద్ధమేనని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇది పోరాట ఫలితం..

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షల్లో మల్టిపుల్‌ జవాబులుగల ప్రశ్నలకు మార్కులు కలపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల  బండి సంజయ్‌ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇది భాజపా యువమోర్చా కార్యకర్తలు, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల పోరాట విజయమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లున్న స్కూల్‌ అసిస్టెంట్లకే స్పౌజ్‌ బదిలీలను వర్తింపజేయడం అన్యాయమన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు కూడా అవకాశం కల్పించాలన్నారు.

మా పార్టీలో కోవర్టులు ఉండరు..

భాజపాలో కోవర్టులు ఉండరని, తమది సిద్ధాంతం గల పార్టీ అని ఎంపీ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అలా అన్న విషయం తన దృష్టికి రాలేదని, ఆయన అలా అని ఉండరని, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని