ఎస్సీ వర్గీకరణపై వంచించిన భాజపా

కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలను నమ్మించిన భాజపా నేటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు.

Updated : 22 Mar 2023 06:06 IST

27, 28 తేదీల్లో దిల్లీలో మహాధర్నా
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

నగరంపాలెం(గుంటూరు), న్యూస్‌టుడే: కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలను నమ్మించిన భాజపా నేటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మార్పీఎస్‌, మహాజన సోషలిస్ట్‌ పార్టీ(ఎంఎస్‌పీ) ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకపోతే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భాజపా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ వస్తున్న తరుణంలో మాదిగ పిల్లలు ఉద్యోగాలకు దూరమవుతున్నారన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ 27, 28 తేదీల్లో దిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో చలో దిల్లీ పేరుతో మహాధర్నాకు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపా కార్యాలయాల ముట్టడి, హైదరాబాద్‌, విజయవాడ సరిహద్దులను దిగ్బంధిస్తామని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొంటామని మంద కృష్ణమాదిగ చెప్పారు.  రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్‌ మాదిగ, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని