పోలీసు భద్రత లేకుండా ప్రజల్లోకి రాలేరా?

సీఎం, మంత్రులు పోలీసు భద్రత లేకుండా స్వేచ్ఛగా ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

Published : 31 May 2023 03:49 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

పెద్దకొత్తపల్లి, న్యూస్‌టుడే: సీఎం, మంత్రులు పోలీసు భద్రత లేకుండా స్వేచ్ఛగా ప్రజల్లోకి ఎందుకు రాలేకపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. వెనకా ముందు పోలీసు వాహనాలతో సైరన్‌ మోగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమేంటన్నారు. మంగళవారం పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో కొనసాగింది. చంద్రకల్‌లో విలేకరుల సమావేశంలో, రాత్రి పెద్దకొత్తపల్లిలో నిర్వహించిన స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశంలో భట్టి మాట్లాడారు. మంగళవారం మంత్రి హరీశ్‌రావు అచ్చంపేట పర్యటన సందర్భంగా ఎక్కడికక్కడ ప్రజలను అదుపులో తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలను నిషేధించారా? అని నిలదీశారు. మంత్రులు వచ్చేముందు ముందస్తు అరెస్టు చేయడమంటే.. ప్రజలను చూసి ఎంత భయపడుతున్నారో అర్థమవుతోందన్నారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచినా పెండింగ్‌ బిల్లుల కోసం భారాసలో చేరారన్నారు. ఇది క్విడ్‌ప్రోకో కిందకే వస్తుందని ఆరోపించారు. గ్రామాభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకుండా సర్పంచులను ప్రభుత్వం వేధిస్తోందని.. దీనిపై ఐక్యంగా పోరాడదామని భట్టి పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని