TDP: లోకేశ్‌కు చిన్న హాని జరిగినా జగన్‌దే బాధ్యత

యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏ చిన్న హాని జరిగినా సీఎం జగన్‌, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని తెదేపా నేతలు స్పష్టం చేశారు.

Updated : 09 Jun 2023 07:12 IST

వైకాపా గూండాలతో కుమ్మక్కైన పోలీసులు
గవర్నర్‌కు తెదేపా బృందం ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏ చిన్న హాని జరిగినా సీఎం జగన్‌, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని తెదేపా నేతలు స్పష్టం చేశారు. పాదయాత్రలోకి వైకాపా గూండాలు చొరబడి అల్లర్లు సృష్టిస్తుంటే.. పోలీసులు వారికి సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్‌పై ప్రొద్దుటూరులో స్థానిక డీఎస్పీ, సీఐల సమక్షంలో కోడిగుడ్లతో దాడి జరిగినా వారు కనీసం స్పందించలేదని విమర్శించారు. రాయలసీమలో కొందరు వైకాపా ముఠా నాయకులు లోకేశ్‌ను అంతమొందిస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్ర సాగుతున్న గ్రామాల్లో చంద్రబాబు, లోకేశ్‌లను కించపరిచేలా వైకాపా నేతలు ఫ్లెక్సీలు కట్టి తెదేపా శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారని, ఘర్షణలకు పురిగొల్పుతున్నారని.. అయినా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సైకో సీఎం’ అని పది తలలు పెట్టి బ్యానర్లు కడతామని, అప్పుడు ఈ పోలీసులు, అధికారులు ఏం చేస్తారో చూస్తామని పేర్కొన్నారు. యువగళానికి మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరుతూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ బృందం గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ముస్లింలపై జరుగుతున్న దాడుల్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలపై రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 50 దాడుల వివరాల్ని ప్రస్తావిస్తూ లోకేశ్‌ రాసిన లేఖను గవర్నర్‌కు అందజేశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు.

వంద ముస్లిం కుటుంబాల్ని గ్రామంలోకి రానివ్వడం లేదు

ముస్లింలపై దాడులు జరుగుతున్నా పోలీసులు కనీసం స్పందించడం లేదని, కేసులు నమోదు చేయడం లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ విమర్శించారు. ‘ముస్లింలపై భౌతిక దాడులు పెరిగాయి. గురజాల మండలంలోని ఓ గ్రామంలో వంద ముస్లిం కుటుంబాల్ని గ్రామంలోకి రానివ్వడం లేదు. పోలీసుల దగ్గరకి వెళితే భద్రత కల్పించలేమని వారు చేతులెత్తేశారు. తప్పుడు కేసు పెట్టడంతో నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు’ అని షరీఫ్‌ పేర్కొన్నారు. గవర్నర్‌ అన్ని విషయాలు శ్రద్ధగా విన్నారని, ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని