Telangana News: మునుగోడులో గెలిస్తే ఏం చేస్తారో వారిద్దరూ చెప్పలేదు: మల్లు రవి

భాజపా, తెరాస బహిరంగ సభలు రెండూ రాజకీయాల చుట్టే తిరిగాయని.. సామాన్య ప్రజల సమస్యలపై ఒక్కరూ ప్రస్తావించలేదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

Published : 22 Aug 2022 16:06 IST

హైదరాబాద్‌: భాజపా, తెరాస బహిరంగ సభలు రెండూ రాజకీయాల చుట్టే తిరిగాయని.. సామాన్య ప్రజల సమస్యలపై ఒక్కరూ ప్రస్తావించలేదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గాంధీ భవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌తో మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారన్నారు. మునుగోడులో గెలిస్తే ఏం చేస్తారని కేసీఆర్, అమిత్ షా చెప్పలేదని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొనేందుకే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. ఎన్నికల హామీల అమలు ప్రస్తావన ఎక్కడా రాలేదన్నారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదనే భాజపా, తెరాస పరస్పరం తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడిన ప్రధాని మోదీ, అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మల్లు రవి ప్రశ్నించారు.

అక్రమాల్లో పోటీ పడుతున్నారు: పొన్నాల లక్ష్మయ్య

‘‘బహిరంగ సభలకు జనం వచ్చినంత మాత్రాన ఓట్లు రావు. కేసీఆర్ మునుగోడులో సెంటిమెంట్‌తో గెలవాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు మునుగోడుకు చేసిందేమిటో సీఎం ఎందుకు చెప్పలేకపోతున్నారు? భాజపా, తెరాస నేతలు అక్రమాల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. దేశాన్ని మోదీ.. రాష్ట్రాన్ని కేసీఆర్.. అప్పుల కుప్పగా మార్చారు. అవినీతి, అక్రమాలు చేసిన వారు జైల్లో ఉండాల్సిన సమయం వచ్చింది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన కాంగ్రెస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు’’ అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని