PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్‌ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ

ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Published : 18 Mar 2024 12:32 IST

జగిత్యాల: ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఆరంభంలో కాసేపు తెలుగులో ప్రసంగించి మోదీ అందరినీ ఉత్సాహపరిచారు.

‘‘దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో భాజపాకు ప్రజల మద్దతు పెరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడు రోజుల్లో తెలంగాణకు రావడం ఇది రెండోసారి. రాష్ట్రంలో భాజపా పెరుగుతోంది.. కాంగ్రెస్‌, భారాస తగ్గుతున్నాయి. రానున్న ఎన్నికల్లో మా పార్టీకి దేశవ్యాప్తంగా 400లకు పైగా సీట్లు రావడం ఖాయం. నేను భారతమాత పూజారిని. తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల. ఇక్కడి ప్రజలను భారాస దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుంది. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసు. భారాస దోపిడీపై కాంగ్రెస్‌ మౌనం వహిస్తోంది. తెలంగాణ డబ్బు ఇప్పుడు దిల్లీ చేరుతోంది’’

‘‘కాంగ్రెస్‌, భారాస రెండూ మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. తెలంగాణను దోచుకున్న వారిని మేం విడిచిపెట్టేది లేదు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయి. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా.. దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పేరు ఉంది. ఇప్పుడు అలాంటి పార్టీల జాబితాలో భారాస చేరింది. ఆ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో, దిల్లీ మద్యం వ్యవహారంలో అవినీతికి పాల్పడింది’’ అని మోదీ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని