Rajasthan: పైలట్‌ పాదయాత్ర షురూ.. సీఎం గహ్లోత్‌ కీలక వ్యాఖ్యలు!

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌తో విభేదాల వేళ.. అవినీతికి, పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్ గురువారం పాదయాత్ర ప్రారంభించారు. అయితే, వర్గ విభేదాలను సృష్టించేవారు ఎప్పటికీ విజయం సాధించలేరని వేరే ఓ కార్యక్రమంలో సీఎం గహ్లోత్‌ వ్యాఖ్యానించారు

Published : 11 May 2023 23:32 IST

జైపుర్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో.. రాజస్థాన్‌ (Rajasthan)లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot), మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ (Sachin Pilot)ల మధ్య విభేదాలు మరోసారి రాజుకున్నాయి. మాజీ సీఎం వసుంధర రాజే (Vasundhara Raje) తన ప్రభుత్వాన్ని కాపాడారంటూ ఇటీవల గహ్లోత్‌ వ్యాఖ్యానించగా.. ఆమెను గహ్లోత్‌ తన నాయకురాలిగా భావిస్తున్నారని పైలట్‌ మండిపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమే.. అవినీతికి, రాష్ట్రంలో పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా పైలట్ గురువారం అజ్‌మేర్ నుంచి జైపుర్‌ వరకు ‘జన సంఘర్ష యాత్ర (Jan Sangharsh Yatra)’ పేరిట పాదయాత్రను ప్రారంభించారు. తన యాత్ర ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం సమస్యలపైనేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అయితే.. వర్గ విభేదాలను సృష్టించేవారు ఎప్పటికీ విజయం సాధించలేరని, పార్టీకి విధేయులుగా ఉండలేరని వేరే ఓ కార్యక్రమంలో సీఎం గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యంలో అందరిని కలుపుకొని పోయేవారు సక్సెస్‌ అవుతారు. విధేయత, నిజాయతీ, నిబద్ధతలతో కాంగ్రెస్‌ పార్టీ విధానాలను నిలబెట్టేందుకు శ్రమించా. కానీ, వర్గ రాజకీయాల్లో మునిగితేలేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. వారు పార్టీకి ఎప్పుడూ విధేయులు కారు. విధేయత చాలా ముఖ్యం’ అని జైపుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గహ్లోత్‌ మాట్లాడారు. కొంతమంది నేతలతో తనకు విభేదాలు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌కు చెందిన వారన్న కారణంతో తన మంత్రివర్గంలో చోటుకల్పించినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే, 45 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని.. ప్రత్యర్థులు కూడా తమ విధేయతను, చిత్తశుద్ధిని ప్రశ్నించలేదని పైలట్ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని