Narayan Rane: ‘నేనక్కడ ఉంటేనా.. ఉద్ధవ్‌ ఠాక్రే చెంప పగిలేది..!’

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ రాణే అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని ఎద్దేవా

Updated : 24 Aug 2021 16:08 IST

కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. అరెస్టుకు రంగం సిద్ధం

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ రాణే అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని ఎద్దేవా చేసిన రాణే.. ఇందుకు ఠాక్రే చెంప పగలగొట్టాలని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అసలేం జరిగిందంటే..

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ రాణే సోమవారం రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న ఠాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఠాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని’’ అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. కేంద్రమంత్రి మానసిక స్థితి సరిగా లేదంటూ శివసేన నేతలు ఆయనపై మండిపడుతున్నారు.

అరెస్టు చేస్తారా..?

ఇదిలా ఉండగా.. సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఆయనను తక్షణమే అరెస్టు చేసేందుకు నాసిక్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం నాసిక్‌ పోలీసుల బృందం రత్నగిరి వెళ్లినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే అరెస్టు వార్తలను కేంద్రమంత్రి ఖండించారు. తాను సాధారణ వ్యక్తిని కాదని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని హెచ్చరించారు. అంతేగాక, తానేం తప్పూ చేయలేదంటూ తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు.

రాణే నివాసానికి భద్రత పెంపు..

మరోవైపు కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ముంబయిలో భాజపా, శివసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. నగర వీధుల్లో ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. అటు ముంబయిలోని రాణే నివాసం ముందు కూడా శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన నివాసానికి పోలీసులు భద్రత పెంచారు.

ఇదిలా ఉండగా.. నారాయణ రాణే కుమారుడు, ఎమ్మెల్యే నితీశ్ రాణేను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన రత్నగిరి వెళ్తుండగా.. టోల్‌ ప్లాజా వద్ద అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని