TDP-Janasena: 20న ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో జరగనున్న యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభకు తొలిసారి చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు.

Published : 11 Dec 2023 19:03 IST

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ.. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో జరగనుంది. తెదేపా (TDP), జనసేన (Janasena) అధినేతలు చంద్రబాబు (Chandrababu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తోపాటు బాలకృష్ణ ఈ సభకు హాజరుకానున్నారు. తెదేపా - జనసేన పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ రానుండటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఇరుపార్టీల శ్రేణులతో పాటు అభిమానులు భారీ ఎత్తున సభకు తరలివస్తారని అంచనా.

విజయోత్సవ సభ నిర్వహణకు 14 ప్రత్యేక కమిటీలను తెదేపా నియమించింది. కమిటీలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్‌, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్‌, ఆలపాటి, బండారు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

ఇప్పటికే యువగళం విజయోత్సవ సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఈ నెల 20న భోగాపురంలో జరిగే విజయోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యువగళం విజయోత్సవ సభకు రవాణా సౌకర్యం కల్పించాలని అచ్చెన్న ఆర్టీసీ ఎండీని కోరారు. అన్ని డిపోల నుంచి అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులు కేటాయించాలని లేఖలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని