ధోనీ వీడ్కోలు పలికాకే నాకు అవకాశాలు

ఎంఎస్‌ ధోనీ వీడ్కోలు పలికాకే తనకు టీమ్‌ఇండియాలో వరుసగా చోటు దక్కిందని వికెట్‌ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. ...

Published : 26 May 2021 16:46 IST

వికెట్‌ కీపర్ వృద్ధిమాన్ సాహా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంఎస్‌ ధోనీ వీడ్కోలు పలికాకే తనకు టీమ్‌ఇండియాలో వరుసగా చోటు దక్కిందని వికెట్‌ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. పూర్తి స్థాయిలో తనకు అవకాశాలు రానందుకు బాధేం లేదన్నాడు. తుది జట్టులో చోటు రాకున్నా.. రిజర్వు బెంచీపై ఉన్నా భారత్‌ విజయం సాధిస్తే సంతోషమేనని తెలిపాడు. రిషభ్‌ పంత్‌లో ప్రస్తుతం ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. కరోనా వైరస్‌ నుంచి సాహా ఈ మధ్యే కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌, ఇంగ్లాండ్‌ సిరీసుకు ఎంపికయ్యాడు.

‘బాగా ఆడితే అవకాశాలు వస్తాయని నేను నమ్ముతా. జట్టుకు సమతూకం, కూర్పు అత్యవసరం. అలాంటప్పుడు కొందరికి తుది జట్టులో చోటు దక్కదు.  విజయాలు సాధిస్తున్నంత వరకు నేను రిజర్వు బెంచీపై ఉన్నా సంతోషమే. ధోనీ భాయ్‌ జట్టులో ఉంటే అన్ని మ్యాచుల్లో అతడే ఆడతాడని అందరికీ తెలుసు. దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు నేను సన్నద్ధం అయ్యేవాడిని. 2010లో నా అరంగేట్రం అలాగే జరిగింది. మొదట అవకాశం లేదని హఠాత్తుగా చోటిచ్చారు. ప్రతి మ్యాచ్‌ ఆడుతానని భావించే సాధన చేస్తాను’ అని సాహా అన్నాడు.

‘కెరీర్‌ మొదట్లో నేను రెండో ప్రాధాన్య కీపర్‌గానే ఉండేవాడిని. ఆటగాళ్లకు గాయాలు తప్పవు. ఆ సందర్భాల్లో మరొకరు అవకాశం అందిపుచ్చుకుంటారు. రిషభ్ పంత్‌ జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. ఒకప్పుడు నాకు సమయం దొరికింది. 2014-2018 మధ్య ప్రధాన వికెట్‌ కీపర్‌గా కొనసాగాను. ఇప్పుడు రిషభ్ వచ్చాడు. అయితే జట్టు యాజమాన్యం ఏం చెబితే అదే చేయడం నా పని. వరుసగా మ్యాచులు ఆడటం వల్ల రిషభ్‌కు ఆత్మ విశ్వాసం పెరిగింది. మొదట్లో పొరపాట్లు చేసేవాడు. ఇప్పుడు చాలా మెరుగయ్యాడు’ అని సాహా వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని