Womens T20 League: మహిళల టీ20 లీగ్‌.. ఫ్రాంచైజీ బిడ్‌ కనీస ధర రూ.400 కోట్లు!

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మహిళల భారత టీ20 లీగ్‌ కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొంది. వచ్చే ఏడాది  మార్చిలో నిర్వహించాలని ఇప్పటికే భావించిన బోర్డు.. తాజాగా ఫ్రాంచైజీల కోసం బిడ్‌లను ఆహ్వానించింది.

Published : 29 Nov 2022 20:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల భారత టీ20 లీగ్‌ను సిద్ధం చేసేందుకు బీసీసీఐ తన చర్యలను ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది మార్చిలో ఐదు జట్లతో లీగ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఐదు ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ టెండర్‌ను పిలిచింది. ఫ్రాంచైజీ కోసం ప్రాథమిక ధర దాదాపు రూ. 400 కోట్లతో (50 మిలియన్‌ డాలర్లు) బరిలోకి దిగాల్సి ఉంటుంది. తొలిసారి పురుషుల లీగ్‌ (2007-2008) కోసం ముంబయి ఫ్రాంచైజీకి రూ. 446 కోట్లకు (అప్పుడు డాలర్‌ విలువ రూ. 40) విక్రయించిన ధరను ప్రామాణికంగా తీసుకొని బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించింది. 

‘‘ప్రస్తుతం క్రికెట్‌కు ఉన్న మార్కెట్‌ డిమాండ్‌, ఆసక్తిని బట్టి బెంచ్‌మార్క్‌ను నిర్ణయించాం. ఒక్కో ఫ్రాంచైజీ రూ. 1000 కోట్ల నుంచి రూ. 1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది. దీనివల్ల దాదాపు రూ. 6 నుంచి 7 వేల కోట్ల వరకు బీసీసీఐ ఖజానాకు చేరే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలతో బ్రాండ్‌కాస్ట్‌ హక్కులను ఈ-వేలంతో కాకుండా బిడ్‌ ద్వారానే కేటాయిస్తుంది. జట్టును సొంతం చేసుకొన్న ఫ్రాంచైజీ ఐదేళ్లపాటు యాజమాన్య హక్కుల కోసం ఫీజును బీసీసీఐకి వాయిదాల్లో కట్టే అవకాశం ఉంది. పురుషుల భారత టీ20 లీగ్‌ మాదిరిగానే ప్రాపర్టీ సొంతమవుతుంది’’ అని బీసీసీఐ అనధికారిక వర్గాలు వెల్లడించాయి. 

ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా మహిళా జట్టును సొంతం చేసుకోవచ్చని బీసీసీఐ పేర్కొంది. అర్హతలకు సంబంధించిన అంశాలను ఆచరించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని వివరాలను బీసీసీఐ వదిలేసిందని పలువురు నిపుణులు చెబుతున్నారు. పురుషుల లీగ్‌ నుంచి వచ్చిన లాభాలను మహిళా జట్టు కోసం బిడ్‌లో పాల్గొనే అవకాశం యాజమాన్యాలకు ఉందా..? వందల కోట్లు పెట్టి కొనుగోలు చేసే కొత్తవారికి లాభాలను ఆర్జించే అవకాశం ఉండాలంటే సుదీర్ఘకాలం లీగ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి కమిట్‌మెంట్‌ను బీసీసీఐ ఇస్తుందా..? వంటి అంశాలపై బోర్డు వివరణ ఇవ్వాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని