BCCI: భారత మహిళల టీ20 లీగ్‌.. మీడియా హక్కుల కోసం బిడ్‌లకు ఆహ్వానం

టీ20 ఫార్మాట్‌ మ్యాచ్‌లకు ఉన్న ఆదరణ మాటల్లో వర్ణించలేం. బీసీసీఐ నిర్వహిచే టీ20 లీగ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటిల్లో ఒకటి. ఈసారి మహిళల కోసం కూడా లీగ్‌ను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా మీడియా హక్కుల కోసం బిడ్‌లను బీసీసీఐ ఆహ్వానించింది.

Published : 10 Dec 2022 00:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మహిళల టీ20 లీగ్‌కు (డబ్ల్యూఐపీఎల్) సంబంధించి బీసీసీఐ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ఫ్రాంచైజీల కోసం బిడ్‌లను పిలిచిన బీసీసీఐ.. తాజాగా మీడియా హక్కుల కోసం బిడ్‌లను ఆహ్వానించింది. ఐదేళ్లపాటు (2023-27) ప్రసార హక్కులను కల్పించనుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. 

‘‘మహిళల టీ20 లీగ్‌ మీడియా హక్కులను పొందేందుకు ప్రఖ్యాత సంస్థలను భారత టీ20 లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆహ్వానిస్తోంది. 2023 - 2027 సీజన్లకు సంబంధించిన హక్కులను పొందేందుకు బిడ్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. టెండర్‌ ప్రాసెస్‌ ప్రకారం హక్కులను కేటాయించడం జరుగుతుంది’’ అని బీసీసీఐ కార్యదర్శి జయ్‌ షా ప్రకటనలో వెల్లడించారు. అయితే మీడియా హక్కుల కోసం సీల్డ్‌ వన్‌టైమ్‌ బిడ్‌ లేదా ఇక్రిమెంటల్‌ ఈ-వేలం అనేది బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. 

‘ఇన్విటేషన్ టు టెండర్’ (ఐటీటీ) బిడ్‌  డాక్యుమెంట్‌ ఖరీదు రూ. 5 లక్షలు (టాక్స్‌లు అదనం). డిసెంబర్ 31వ తేదీ వరకు ఐటీటీని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. బీసీసీఐ విధించిన షరతులను అధిగమిస్తేనే బిడ్‌ దాఖలు చేసేందుకు అర్హత లభిస్తుంది. దీంతో ఐటీటీని కొనుగోలు చేసినంత మాత్రాన బిడ్‌ దాఖలు చేసినట్లు కాదు. ఈ ఏడాది పురుష టీ20 లీగ్‌ కోసం బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు దాదాపు రూ. 45 వేల కోట్లకుపైగా అమ్ముడైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని